TTD: బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ కీలక నిర్ణయం - భక్తులకు సులభ దర్శనం..!!
Tirumala: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబరు 14వ తేదీ అంకురార్పణంతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు టీటీడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టినట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అక్టోబరు 19న జరుగనున్న గరుడవాహనసేవ దర్శనాన్ని ఎక్కువ మంది భక్తులకు కల్పించాలనే ఉద్దేశంతో రాత్రి 7 గంటలకు బదులుగా సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ:రేపటి నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్ఫణ జరగనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు జరుగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 19న జరుగనున్న గరుడవాహనసేవ దర్శనాన్ని ఎక్కువ మంది భక్తులకు కల్పించాలనే ఉద్దేశంతో రాత్రి 7 గంటలకు బదులుగా సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. అదేవిధంగా, ఎక్కువ మంది సామాన్య భక్తులకు మూలమూర్తి దర్శనం కల్పించేందుకు వీలుగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

గరుడసేవ నాడు ప్రత్యేకంగా:అక్టోబరు 19న గరుడసేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, అక్టోబర్ 23న చక్రస్నానం నిర్వహించనున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలలో వయోవృద్ధులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో చెప్పారు. అక్టోబర్ 19న గరుడసేవ సందర్భంగా ఆ రోజు ద్విచక్ర వాహనాలను అనుమతించరన్నారు.
గరుడసేవనాడు గరుడ వాహనాన్ని వీక్షించేందుకు ముందు రోజు రాత్రి నుండే అసంఖ్యాకంగా భక్తులు గ్యాలరీలలో వేచి ఉంటారన్నారు. కావున భక్తుల సౌకర్యార్థం గరుడ వాహనాన్ని ముందుగా ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఆగమశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తరువాతే రాత్రి వాహనసేవ నిర్వహిస్తారు. కాగా, అక్టోబరు 19న సాయంత్రం 6.15 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

ప్రత్యేక ప్రవేశ దర్శనాల రద్దు:19న సాయంత్రం 6.30 గంటలకు గరుడసేవ ప్రారంభమవుతుంది. గతంలో రాత్రి 9 గంటలకు గరుడసేవ ప్రారంభమవుతుండగా, ఆ సమయాన్ని రాత్రి 7 గంటలకు మార్చారు. ప్రస్తుతం ఆగమ సలహామండలి నిర్ణయం మేరకు గరుడసేవ సమయాన్ని అరగంట ముందుకు మార్చడం జరిగింది. శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహనసేవకు మాత్రమే అనుమతిస్తారు. అక్టోబరు 14న అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబరు 14 నుండి 23వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.












Click it and Unblock the Notifications