ఆంధ్రప్రదేశ్ డీజీపీగా గౌతమ్ సవాంగ్.. ఇన్ఛార్జ్ నుంచి ఫుల్ పవర్స్..!
అమరావతి : ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇన్ఛార్జ్ డీజీపీగా కొనసాగుతున్న గౌతమ్ సవాంగ్ను పూర్తిస్థాయిలో నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ అధికారంలోకి రాగానే భారీగా ఐపీఎస్ బదిలీలు జరిగాయి. ఆ క్రమంలో అప్పటి డీజీపీ ఆర్పీ ఠాకూర్ను బదిలీ చేస్తూ.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్న గౌతమ్ సవాంగ్ను ఇన్చార్జ్ డీజీపీగా నియమించారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఆయన పనితీరుపై సంతృప్తి చెందిన ప్రభుత్వం.. సీనియర్ అధికారిగా ఉన్న గౌతమ్ సవాంగ్ను పూర్తిస్థాయి డీజీపీగా అనౌన్స్ చేసింది.
1986 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ 1963, జులై 10న జన్మించారు. వివిధ హోదాల్లో పనిచేసిన గౌతమ్ సవాంగ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా కొనసాగారు. అదే క్రమంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కొలువుదీరాక ఇన్ఛార్జ్ డీజీపీగా నియమితులయ్యారు. ఇప్పుడు పూర్తిస్థాయి డీజీపీగా సేవలందించనున్నారు.
అమ్మకు
అన్యాయం..
ఆస్తి
గుంజుకుని..
చివరకు..!
l
చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు గౌతమ్ సవాంగ్. చిత్తూరు, వరంగల్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. 2001 - 2003 మధ్య వరంగల్ రేంజి డీఐజీగా, 2003 - 2004 వరకూ ఎస్ఐబీ డీఐజీగా పనిచేశారు. 2004 - 2005 మధ్య ఏపీఎస్పీ పటాలం డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్పై వెళ్లారు.
ఆ క్రమంలో 2005 - 2008 మధ్య కాలంలో సీఆర్పీఎఫ్ డీఐజీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్.. 2008 - 2009 మధ్య శాంతిభద్రతల విభాగం ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2015 - 2018 సమయంలో విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేయడమే గాకుండా ఐపీఎస్గా తనదైన ముద్రవేశారు. గతేడాది జులై నుంచి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీ స్థాయి నుంచి పూర్తిస్థాయి డీజీపీగా గౌతమ్ సవాంగ్ను నియమించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.