విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిజిగా బాధ్యతలు స్వీకరించిన గౌతం సవాంగ్
విజయవాడ : రాష్ట్ర ప్రధాన పరిపాలన, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా దామోదర్ గౌతం సవాంగ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ లోని విజిలెన్స్ సెంట్రల్ ఆఫీసులో ఇప్పటివరకు ఆ విభాగం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తోన్నహోంశాఖ కార్యదర్శి అనురాధ నుంచి ఈ బాధ్యతలు తీసుకున్నారు.
ఆర్టీసీ బస్ భవన్లో ఉన్న ఈ విజిలెన్స్ ప్రధాన కార్యాలయాన్ని డిజి గౌతం సవాంగ్ పరిశీలించారు. తాను మొదటిసారిగా విజిలెన్స్ విభాగ బాధ్యతలు చూస్తున్నానని.. సాధ్యమైనంత త్వరగా ఇక్కడి కార్యకలాపాలపై అవగాహన పెంచుకుని ప్రజల సహకారంతో మెరుగైన పనితీరు కనబరుస్తానని సవాంగ్ ఈ సందర్భంగా చెప్పారు. మూడేళ్లు విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పనిచేయడం సంతృప్తినిచ్చిందని సవాంగ్ తెలిపారు.
విజయవాడ కమీషనర్ గా తన పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు-ప్రభుత్వ సహకారంతో కొన్ని కార్యక్రమాలు చేశామని...ఇంకా చేయాల్సింది చాలా ఉందని సవాంగ్ చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం విజిలెన్స్ విభాగానికి పూర్తిస్థాయి డీజీ నియామకం ఇదేనని వెల్లడించారు. ఈ విభాగంలో కొన్ని కీలకమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయని...వీటిపై సమీక్షించి త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తామన్నారు.