చంద్రబాబు వ్యాఖ్యలకు జీఎన్ రావు కౌంటర్: వారి అభిప్రాయల మేరకే: అజయ్ కల్లంపైనా..!
టీడీపీ అధినేత చంద్రబాబు తన గురించి..తమ కమిటీ సిఫార్సుల గురించి చేసిన వ్యాఖ్యల మీద రిటైర్డ్ ఐఏయస్ అధికారి జీఎన్ రావు స్పందించారు. చంద్రబాబు ఆరోపణలను ఖండించారు. కమిటీలో సభ్యులను ప్రభావితం చేసి నివేదిక తయారు చేశారనడం అర్థరహితమన్నారు. ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని అన్ని ప్రాంతాల అభివృద్ధికి సూచనలు చేసామని స్పష్టం చేసారు.
అదే సమయం లో సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం చెప్పినట్టుగా నివేదిక ఇచ్చారని చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. చంద్రబాబు ఆరోపణలన్నీ నిరాధారం, భ్రాంతితో కూడినవని జీఎన్ రావు పేర్కొన్నారు. ఎవరి ప్రమేయం లేకుండా కమిటీ సభ్యులందరూ కలసి సమష్టిగా రహస్యంగా నివేదిక రూపొందించారని వివరించారు.
ఎవరూ ప్రభావితం చేయలేదు..
తమ కమిటీ సిఫార్సుల మీద టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు జీఎన్ రావు స్పందించారు. తమ కమిటీలో అన్ని రంగాలకు చెందిన అపార అనుభవమున్న నిపుణులు, నిష్ణాతులు ఉన్నారని తెలిపారు. కమిటీలోని సభ్యులకు పట్టణ ప్రణాళిక, డిజైనింగ్, నగరాభివృద్ధి, ప్రపంచ నగరాల అభివృద్ధి అంశాల్లో విశేష అనుభవం, నైపుణ్యం ఉన్నాయని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు, ప్రాజెక్టుల పూర్తికి అనుసరిస్తున్న వ్యూహాలపై మాత్రమే ప్రభుత్వంలోని వ్యక్తులతో మాట్లాడాం తప్ప నివేదికలోని అంశాలపై ఎవ్వరితోనూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతోపాటు ప్రజల నుంచి సలహాలు, అభిప్రాయాలను స్వీకరించామని వివరించారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధికి...
రాజధానితోపాటు 13 జిల్లాల్లో మానవాభివృద్ధి సూచికల పరిస్థితులు.. అభివృద్ధి.. వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ప్రజల ఆకాంక్షలు, సూచనలకు అనుగుణంగా రాజధానితోపాటు అన్ని ప్రాంతాల అభివృద్ధికి సూచనలు చేశామని జీఎన్ రావు చెప్పుకొచ్చారు. నివేదిక తయారుచేసే సమయంలో కమిటీ సభ్యులకు కానీ, తనకు కానీ ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు లేదా ప్రభుత్వంలోని వ్యక్తులు ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని, వారి నుంచి ఎటువంటి సూచనలు తీసుకోలేదని జీఎన్ రావు స్పష్టం చేశారు.
సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం మార్గదర్శకాల ఆధారంగా నివేదిక తయారు చేశామని చంద్రబాబు అనడం నిరాధారం, అవాస్తవం, ఊహాజనితమని స్పష్టం చేశారు. కన్వీనర్గా కమిటీలోని సభ్యులకు తాను సహాయ సహకారాలు అందించానని కమిటీ కన్వీనర్ గా వ్యవహరించిన జీఎన్ రావు చెప్పుకొచ్చారు.