కోటంరెడ్డికి సడన్ చెక్: బెదిరింపు ఫోన్ కాల్స్ వేళ.. జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు కల్పించిన భద్రతను తగ్గించింది.
నెల్లూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సొంత పార్టీలో తిరుగుబాటును లేవనెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన దూకుడుకు చెక్ పెట్టేలా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, తన వర్గానికి చెందిన నాయకులను కూడా పార్టీకి వ్యతిరేకులుగా తీర్చిదిద్దడానికి కోటంరెడ్డి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోన్న వేళ.. ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

భద్రత కుదింపు..
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భద్రతను తగ్గించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఎమ్మెల్యే హోదాలో ప్రస్తుతం ఆయనకు కల్పిస్తోన్న భద్రతలో కోత పెట్టింది. 2+2 గా ఉన్న సెక్యూరిటీని 1+1కు తగ్గించింది. భద్రతను తగ్గిస్తూ జారీ చేసిన అధికారిక ఉత్తర్వులపై కోటంరెడ్డి తన అంగీకారాన్ని తెలియజేశారు. జిల్లా పోలీసు అధికారులు తనకు అందజేసిన డాక్యుమెంట్లపై సంతకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య విమర్శలకు దారి తీస్తోంది.

రాజకీయ కక్ష..
కోటంరెడ్డి ఘాటుగా స్పందించారు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. తనకు భద్రతను కల్పించాల్సిన పరస్థితుల్లో కుదించడం కక్షపూరితమని విమర్శించారు. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ అందుతోన్నాయని, అలాంటి పరిస్థితుల్లో అదనపు భద్రతను కల్పించాల్సింది పోయి కుదించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అటు భద్రతను కుదించడం పట్ల కోటంరెడ్డి అనుచరులు భగ్గుమంటోన్నారు.

అనుచరులు భగ్గు..
ప్రభుత్వంపై విమర్శలు చేసినంత మాత్రాన భద్రతను తగ్గించడంలో అర్థం లేదంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన నాయకులు నిలదీస్తోన్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి గళాన్ని వినిపించిన ఎమ్మెల్యేలకు భద్రతను తగ్గించాల్సిన అవసరం ఏమొచ్చిందని ధ్వజమెత్తుతున్నారు. ఇదివరకు వెంకటగిరికి చెందిన శాసన సభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డికి ప్రభుత్వం భద్రతను తగ్గించిందని, ఇప్పుడు కోటంరెడ్డి విషయంలోనూ అదే రకంగా వ్యవహరించిందని గుర్తు చేశారు.

బాహటంగా విమర్శలు..
వైఎస్ఆర్సీపీ నుంచి వరుసగా రెండుసార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కోటంరెడ్డి ప్రభుత్వంపై బాహటంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ ఆయన ఆరోపించారు. ఎన్నో అవమానాలను తాను భరించానని, అలాంటి చోట కొనసాగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటిని బయటపెడితే జగన్ ప్రభుత్వం కేంద్రానికి వివరణలు, సమాధానాలను ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications