రూ. ఐదు కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు శుక్రవారంనాడు ఐదు కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ప్రయాణికుల నుంచి ఈ బంగారాన్ని వారు పట్టుకున్నారు. వారు బంగారాన్ని అక్రమంగా తీసుకుని వచ్చినట్లు ఆరోపిస్తున్నారు.
సింగపూర్ నుంచి వచ్చిన ఆ ముగ్గురిని కూడా అధికారులు అరెస్టు చేశారు. అధికారులు 18 బంగారం బార్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో బార్ కిలో బరువు ఉంటుంది. వాటి విలువ ఐదు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
ముగ్గురు ప్రయాణికులు కూడా సింగపూర్ నుంచి వచ్చిన విమానం నుంచి శుక్రవారం తెల్లవారు జామున శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆ ముగ్గురు హజీ మొహమ్మద్, జియావుద్దీన్, చొక్కలింగం ఓ ప్రైవేట్ విమానంలో ఇక్కడికి వచ్చారు.
శంషాబాద్ విమానాశ్రయానికి తెచ్చిన బంగారాన్ని వారు చెన్నైకి తరలించాలని అనుకున్నట్లు కస్టమ్స్ అధికారులు చెప్పారు. సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో కూడా శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటనలు జరిగాయి.