చంద్రబాబు గుడ్న్యూస్: రైతుల ఖాతాల్లో 48 గంటల్లో డబ్బుల జమ
ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధితోపాటు సంక్షేమానికి కూడా సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. ప్రధానంగా రైతుల సమస్యలపై ఆయన ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులు అందక గత ఐదు సంవత్సరాల్లో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అయితే పౌరసరఫరాలశాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారులతో కలిసి సమీక్షలు నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని నిర్ణయించారు.
మంత్రులతోపాటు కలెక్టర్లు కూడా పాల్గొన్నారు
దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట కొనుగోలు చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోను వారికి డబ్బులివ్వడంలో ఆలస్యం కాకూడదని అధికారులను ఆదేశించారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోగా వారి ఖాతాల్లో డబ్బులు పడాల్సిందేనని స్పష్టం చేశారు. ఎవరైనా అధికారులు అలక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తోందని, దాని ప్రకారం రైతుల ఖాతాల్లో ఆటోమాటిక్ గా డబ్బులు పడతాయన్నారు. గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసి నెలల తరబడి డబ్బులు వేయకుండా వారిని తీవ్ర ఇక్కట్లక గురిచేశారంటూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, 26 జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులు పాల్గొన్నారు.

రైతులకు రూ.2331 కోట్లు చెల్లించారు
ఈ ఆర్థిక సంవత్సరంలో 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. 1.51 లక్షల రైతులకు రూ.2331 కోట్లు చెల్లించింది. ఈ తరుణంలోనే రాష్ట్రవ్యాప్తంగా రైతులు తమ ధాన్యాన్ని ఎక్కడైనా విక్రయించుకునేలా సులభతర విధానాన్ని తీసుకువచ్చింది. అన్నదాతలు తమ ధాన్యాన్ని జిల్లాల్లోని ఏ బియ్యం మిల్లులోనైనా విక్రయించుకునే అవకాశాన్ని కల్పించింది. 26 జిల్లాల కలెక్టర్లకు, పౌరసరఫరాలశాఖ అధికారులకు ఈమేరకు ఆదేశాలు అందాయి.












Click it and Unblock the Notifications