ఇకనుంచి బెంగుళూరు వెళ్లడం ఎంతో సులువు
ఇకనుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు చేరుకోవడం ఎంతో సులువు కానుంది. అది కూడా రాయలసీమ వాసులకే.. అందులోను ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులకు. వారికి రైల్వేశాఖ శుభవార్తను వినిపించింది. ప్రస్తుతం ప్రతిరోజు బెంగళూరు నుంచి పుట్టపర్తి వరకు నడుస్తున్న ప్యాసింజర్ రైలును అనంతపురం వరకు అధికారులు పొడిగించారు. 06515 నెంబరుతో బెంగళూరు నుంచి పుట్టపర్తి వరకు, 06516 నెంబరుతో పుట్టపర్తి నుంచి బెంగళూరు వరకు నడుస్తోంది. అనంతపురం నుంచి బెంగళూరుకు ప్రజలు అధిక సంఖ్యలో పనులుమీద వెళుతుంటారు. వారికి ఈ నిర్ణయం ఎంతో సౌకర్యవంతంగా ఉండబోతోంది.
రైల్వే మంత్రితో మాట్లాడిన ఎంపీ అంబికా
అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో మాట్లాడి ఈ సౌకర్యాన్ని కల్పించారు. ఈ రైలు ప్రతిరోజు బెంగళూరు నుంచి ఉదయం 8.15 గంటలకు బయలుదేరుతుంది. పుట్టపర్తికి 11.45 గంటలకు, ధర్మవరంకు 12.35 గంటలకు, అనంతపురంకు మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు అనంతపురం నుంచి మధ్యాహ్నం 2.00 గంటలకు బయలుదేరుతుంది. ధర్మవరంకు రూ.300 గంటలకు, పుట్టపర్తికి 3.30 గంటలకు, బెంగళూరుకు రాత్రి 7.00 గంటలకు చేరుకుంటుంది.

పెరగనున్న వందేభారత్ రైళ్ల సంఖ్య
వందేభారత్ రైళ్లపై ఇటీవల రాళ్ల దాడి పెరిగిపోతోంది. అనంతపురం మీదుగా నడుస్తున్న వాటిపైనే రాళ్లదాడులు జరుగుతున్నాయి. అలాగే చత్తీస్ గడ్ లోని దుర్గ్ నుంచి విశాఖ వరకు ట్రయల్ రన్ గా వచ్చిన వందేభారత్ రైలుపై కూడా రాళ్లదాడి జరిగింది. ఈ సంఘటనలో ఎగ్జిక్యూటివ్ చైర్ కారు బోగీ అద్దాలు పగిలాయి. వందేభారత్ రైళ్లకు అత్యంత భద్రత కల్పిస్తున్నామని అధికారులు, రైల్వే పోలీసులు చెబుతున్నప్పటికీ దాడులు మాత్రం ఆగడంలేదు. దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సేవలు పెరుగుతున్నాయి. రోజురోజుకు ప్రయాణికుల నుంచి వీటికి మంచి ఆదరణ లభిస్తుండటంతో ప్రధాన నగరాల మధ్య వీటిని నడిపిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో మొత్తం తొమ్మిది వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. భవిష్యత్తులో వీటి సంఖ్య పెరగనుంది.












Click it and Unblock the Notifications