ఎన్నికలవేళ ఏపీపై నరేంద్రమోడీ వరం
విభజన హామీల్లో భాగంగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాల్సిన ఉన్న సంగతి తెలిసిందే. అనువైన స్థలాన్ని కేటాయిస్తే వెంటనే జోన్ ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ విజయనగరం వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కు తెలిపారు. ఈ విషయాన్ని ఎంపీ బెల్లాన స్వయంగా వెల్లడించారు. విశాఖపట్నం-భువనేశ్వర్ వందేభారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు.
విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ఆలస్యమవుతోంది. వాస్తవానికి స్థల సేకరణ పూర్తికావడంతోపాటు నిధులు కూడా సిద్ధంగానే ఉన్నాయి. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి స్వయంగా రాజ్యసభలోనే వెల్లడించారు. అయితే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఏర్పాటు చేయాల్సిన జోన్ పనులను కేంద్రం కావాలనే ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందంటున్నారు. జోన్ ఏర్పాటుకు ఏపీ ఇస్తామంటున్న భూములను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడంలేదంటున్నారు. మూడున్నర సంవత్సరాలుగా జోన్ కు సంబంధించిన డీపీఆర్ పెండింగ్ లోనే ఉంది. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడం, తెలుగుదేశం-జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడిన భారతీయ జనతాపార్టీ అందుకనుగుణంగా అడుగులు వేస్తోంది.

ఇన్ని సంవత్సరాలుగా ఏపీపై నిర్లక్ష్యం వహించి ఎటువంటి విభజన హామీలు నెరవేర్చకుండా ఎన్నికల సమయంలో ప్రజలముంగిటకు వెళ్లకూడదని, అందుకనుగుణంగా కొన్ని వరాలు ప్రకటిస్తే ప్రజల్లో ఆగ్రహం చల్లారుతుందని ఏపీ బీజేపీ నాయకులు కేంద్ర కమిటీకి నివేదిక ఇచ్చారు. చిలకలూరిపేటలో జరిగే సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూటమి సభలో పాల్గొననున్నారు. అందులో భాగంగా వేదికపై నుంచి ఏపీకి ప్రకటించే వరాల్లో రైల్వేజోన్ కూడా ఒకటి ఉంటుందంటున్నారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్ పేరుతో ఈ జోన్ ఏర్పాటు కావల్సి ఉంది. భూములకు సంబంధించిన వివాదాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్చించుకొని పరిష్కరిస్తే వెంటనే జోన్ పనులు ప్రారంభమవుతాయని, ఎన్నికల సమయంలోగా పనులు ప్రారంభించాలని విశాఖ రైల్వేజోన్ సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications