హిస్టరీ క్రియేట్: ప్రపంచం గూగుల్లో వెతికితే.. గూగుల్ ఏపీని వెతుక్కుంది
విశాఖ జిల్లా తర్లువాడ వేదికగా 'గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్'కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఈ క్లౌడ్ డేటా సెంటర్ రూపుదిద్దుకోనుంది. తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో 600 ఎకరాల విస్తీర్ణంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ను గూగుల్ నిర్మిస్తోంది.
శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. "ప్రపంచమంతా గూగుల్లో సమాచారం కోసం సెర్చ్ చేస్తుంటే, గూగుల్ సంస్థ తన అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ను ఎంచుకోవడం గర్వకారణం" అని ఆయన పేర్కొన్నారు. 30 ఏళ్ల క్రితం సైబరాబాద్ను నిర్మించి ఐటీ విప్లవానికి నాంది పలికామని, నేడు విశాఖలో గూగుల్ రాకతో ఏపీ చరిత్రలో ఏప్రిల్ 28వ తేదీ శాశ్వతంగా నిలిచిపోతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు దేశానికే గ్రోత్ ఇంజన్గా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏపీ - ఏఐ డేటా గేట్వే
ఈ ప్రాజెక్టును 2028 సెప్టెంబరు నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారు. ప్రాజెక్టుకు అవసరమైన నీటి సమస్యను పరిష్కరిస్తామని, 60 రోజుల్లోనే గోదావరి నీటిని విశాఖకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గూగుల్ ఏఐ హబ్ ద్వారా కేవలం పెట్టుబడులే కాకుండా, పరిపాలనలో కూడా విప్లవాత్మక మార్పులు రానున్నాయి. సీఎంఓలో తనకు సహకరించేందుకు ఒక 'ఏఐ అసిస్టెంట్'ను కూడా నియమించుకోనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఇది సుపరిపాలనలో సరికొత్త మైలురాయి కానుంది.
ఉత్తరాంధ్ర దశ మార్చనున్న ప్రాజెక్టులు
గూగుల్ రాకతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోనుందని సీఎం తెలిపారు. గతంలో వలసలకు నిలయంగా ఉన్న ఉత్తరాంధ్ర, ఇకపై ఉద్యోగాలకు చిరునామాగా మారుతుందన్నారు. ట్యాలెంట్ మైగ్రేషన్కు తెరపడి, ఇతర ప్రాంతాల నుంచి యువత ఇక్కడికే వలస వస్తారని ధీమా వ్యక్తం చేశారు. జూలైలో ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుందని, 2028 నాటికి ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నుంచి ఎగుమతులు మొదలవుతాయని వివరించారు. అనకాపల్లి జిల్లా మరో 'రంగారెడ్డి జిల్లా'లా అభివృద్ధికి కేంద్రబిందువు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రైల్వే జోన్ సాకారం.. పెట్టుబడుల్లో నెంబర్ 1
సౌత్ కోస్టల్ రైల్వే జోన్కు జూన్ 1వ తేదీ నుంచి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తున్నందుకు కేంద్ర రైల్వే మంత్రికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే రావడం విశేషమన్నారు. ప్రాజెక్టుల గ్రౌండింగ్లో ఏపీ నెంబర్ వన్గా ఉందని, 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని పునరుద్ఘాటించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలోనూ 90 గిగావాట్ల ఉత్పత్తికి ఒప్పందాలు జరిగాయని, విశాఖ కేంద్రంగా ఏపీ గ్లోబల్ టెక్ మ్యాప్లో అగ్రస్థానంలో నిలుస్తుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications