ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం: టీడీపీ నిర్వాకమేనంటోన్న అధికార పార్టీ
అమరావతి: శాసన మండలిలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదాల ఫలితం.. ప్రభుత్వ ఉద్యోగుల మీద పడింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ రెండు పార్టీల సభ్యుల మధ్య వాడివేడిగా సాగిన వాగ్వివాదాలు, తోపులాట వల్ల ప్రభుత్వ ఉద్యోగులు రెండు రోజుల పాటు ఆలస్యంగా తమ జీతాలను అందుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ద్రవ్య వినిమయ బిల్లును శాసన మండలి ఆమోదించకుండానే నిరవధికంగా వాయిదా వేయడం దీనికి కారణమైంది.
విశాఖలో మరోసారి విష వాయువు లీక్: ఇద్దరు మృతి: నలుగురికి గాయాలు: పలువురికి అస్వస్థత
ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీ ఆమోదించినప్పటికీ.. మండలిలో అది సాధ్యపడలేదు. ఈ బిల్లును ఉభయ సభలో ఆమోదించితే గానీ ఉద్యోగుల జీతాల చెల్లింపు సహా, ఇతరత్రా ఆర్థిక అవసరాలకు ప్రభుత్వం ఖజానా నుంచి నిధులను ఖర్చు చేయలేదు. అలా చేయడం చట్టవిరుద్ధమౌతుంది. అందుకే- జులై 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలను చెల్లించలేకపోవచ్చని చెబుతున్నారు. రెండురోజులు ఆలస్యంగా అంటే.. 3వ తేదీన జీతాలు చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అంటున్నారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై టీడీపీ సభ్యులు దాడికి ప్రయత్నించడం వంటి అవాంఛనీయ సంఘటనలు శాసన మండలిలో చోటు చేసుకున్నాయి. ఇలాంటి వాతావరణం మధ్య మండలి ఛైర్మన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఫలితంగా ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు.
విశాఖలో మరోసారి విష వాయువు లీక్: ఇద్దరు మృతి: నలుగురికి గాయాలు: పలువురికి అస్వస్థత
తెలుగుదేశం పార్టీ సభ్యుల నిర్వాకం వల్లే ఉద్యోగులకు సకాలంలో వేతనాలను చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని అధికార వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ బలాన్ని చాటుకోవడానికి, రాజకీయ ఉనికి కోసం టీడీపీ నాయకులు పాకులాడుతున్నారని, దీనికోసం శాసన మండలిని తమ వేదికగా మార్చుకున్నారని అంటున్నారు. శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సభ్యులు ఉండటం వల్లే వారు అన్నింటికీ తెగించారని విమర్శిస్తున్నారు.
అనుభవజ్ఙుడు, మాజీ స్పీకర్, ఆర్థిక శాఖ మాజీమంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు సారథ్యంలో టీడీపీ సభ్యులు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. ద్రవ్య వినిమయ బిల్లును శాసన మండలి ఆమోదించకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను చెల్లించడం కష్టతరమౌతుందనే విషయం యనమలకు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. తమపై ఆధిపత్యాన్ని, పైచేయిని సాధించడానికి టీడీపీ సభ్యులు మండలిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.