ఏపీలో ఆక్వా రైతులకు కూటమి సర్కారు తీపి కబురు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్వా రైతులకు తీపికబురు ప్రకటించింది. ఈ మేరకు ఆక్వాకల్చర్ రంగ అభివృద్ధికి కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ఆక్వా రైతులకు, కంపెనీలకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేలా "ఏపీ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కంపెనీ" (APPPC) ఏర్పాటు చేసింది. ఈ కొత్త సంస్థ ద్వారా రైతులకు అవసరమైన సేవలన్నీ అందించనున్నారు.
అలాగే ఫీడ్ ధరపై రూ.14 తగ్గింపు అందరికీ సమానంగా వర్తింపజేయాలని నిర్ణయం తీసింది. విద్యుత్ టారిఫ్ను కూడా తగ్గించి రైతులపై ఉన్న భారం తగ్గించనున్నారు. ఈ విషయాలపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు మీడియా సమావేశంలో వెల్లడించారు. మూడు నెలల క్రితం ఆక్వా పరిశ్రమలో వచ్చిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఫిషరీస్ డిపార్ట్మెంట్, APSADA కలిసి పలు చర్చలు జరిపాయని తెలిపారు. ఫలితంగా, ఫీడ్ ధరపై నాలుగు రూపాయల తగ్గింపు నిర్ణయించడంతో పాటు, MRPపై రూ.14 వరకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇంకా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు త్వరలో ఒక యూనిట్ విద్యుత్ను రూ.1.50కే అందించే విధంగా చర్యలు తీసుకోనుందని వెల్లడించారు. కైకలూరు నియోజకవర్గంలో, తన నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోందని వివరించారు. కానీ ఈ రంగంపై రూ.600 కోట్ల వరకు భారం పడుతోందని తెలిపారు. ఇది కేవలం రైతు ఒక్కడిపైనే మోపడం సరైంది కాదని పేర్కొన్నారు.
స్థానిక మార్కెట్ను ప్రోత్సహించేందుకు APPPC ద్వారా రూ.40 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సంస్థ ద్వారా వంద గ్రాముల నుంచి కిలో వరకూ రొయ్యలను ప్యాక్ చేసి మార్కెట్లోకి తేనున్నారు. అలాగే, "మటన్ కన్నా రొయ్యలు ఆరోగ్యానికి మేలని" ప్రచారం చేయడం ద్వారా ప్రజల వినియోగాన్ని పెంచాలని సంకల్పించారు.
ప్రస్తుతం స్థానిక మార్కెట్పై 5% జీఎస్టీ ఉండగా.. దీన్ని రద్దు చేయాలనే అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించనున్నట్టు తెలిపారు. రొయ్యల ఎగుమతుల్లో ప్రస్తుతం ఎటువంటి ఆటంకం లేదని.. స్టాక్ మొత్తం ఇప్పటికే బయటికి వెళ్లిపోయిందని తెలిపారు. ఇప్పుడు అవసరం ఉన్నది దేశీయ వినియోగం పెంపుదలే అని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications