ఓ అడుగు ముందుకేసిన పవన్ కల్యాణ్..!!
Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
ఈ క్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ అడుగు ముందుకేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో కూడా గ్రామసభలను నిర్వహించాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో మొత్తం 13,326 పంచాయతీలు ఉండగా.. వాటన్నింట్లోనూ ఒకేరోజు ఒకేసారి గ్రామసభలను నిర్వహించేలా పవన్ కల్యాణ్ చర్యలను తీసుకున్నారు. ఈ నెల 23వ తేదీన వాటిని ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగ్రాన్ని ఆదేశించారు. దీనికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభలను నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. దీనికి అవసరమైన విధి విధానాలపై ఆయన ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోన్నామని గుర్తు చేశారు. ప్రభుత్వం విడుదల చేసే ప్రతి రూపాయి కూడా బాధ్యతతో ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అన్నారు.
జిల్లా, మండలం, గ్రామ స్థాయి వరకు ఉన్న అధికారులందరూ కూడా ఈ పథకం కింద చేపట్టిన పనులను అమలు చేయడం, సకాలంలో పూర్తి చేయడంలో బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఉపాధి హామీ కింద వంద రోజుల పని దినాలను ఖచ్చితంగా కల్పించేలా అన్ని గ్రామ సభల్లోనూ తీర్మానాలను ఆమోదిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఆయా తీర్మానాల్లో పొందుపర్చాల్సిన అంశాలు, అర్హులైన ప్రతి లబ్దిదారుడు, ప్రతి కుటుంబానికీ ఉపాధి హామీ పథకం కింద సంవత్సరంలో 100 రోజుల పని దినాలను కల్పించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications