శ్రీవారి చెంత అపూర్వ ఆధ్యాత్మిక ఘట్టం- దివ్య మంగళ నీరాజనం
తిరుమలలో భక్తుల విపరీత రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో రెట్టింపు సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. తిరుమల కొండ కిటకిటలాడుతోంది. ఆదివారం నాడు ఏకంగా 91,793 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,221 మంది తలనీలాలు సమర్పించారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.90 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకూ క్యూలైన్ ఏర్పడింది.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.38 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అదే స్థాయిలో 3.31 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీటిని అందిస్తున్నారు.

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది.ఈ పవిత్ర వేడుకలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన శ్రీ మలయప్పస్వామి వారు గరుడ వాహనంపై కొలువుదీరారు. భక్తకోటికి దివ్య దర్శనం ఇచ్చారు. దివ్యాభరణాలు ధరించిన శ్రీ మలయప్పస్వామి వారు జగన్మోహన రూపంలో గరుడ వాహనంపై అధిష్ఠించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.
సాంప్రదాయ మంగళవాయిద్యాలు, కోలాటాలు, భక్త బృందాల సంకీర్తనల నడుమ ఈ శోభాయాత్ర సాగింది. మాడ వీధుల్లో గంటల తరబడి వేచి ఉన్న భక్తులు కర్పూరం సమర్పిస్తూ, భక్తిపూర్వకంగా గోవింద నామస్మరణ చేశారు. భక్తుల జయజయధ్వానాలతో, ఆధ్యాత్మిక తన్మయత్వంతో తిరుమల వీధులన్నీ మారుమోగాయి. ఈ అపూర్వ ఆధ్యాత్మిక ఘట్టాన్ని కనులారా తిలకించడానికి వేలాది మంది భక్తులతో తిరుమల గిరులు కిక్కిరిసిపోయాయి.
హిందూ పురాణాల ప్రకారం, 108 వైష్ణవ దివ్య దేశాలలో గరుడ వాహన సేవకు ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. శ్రీమహావిష్ణువు పరమ భక్తుడు, వాహనమైన గరుడుడు వేద స్వరూపానికి, ఆధ్యాత్మిక జ్ఞానానికి వైరాగ్యానికి ప్రతీక. తనను సంపూర్ణ విశ్వాసంతో శరణు కోరిన భక్తులకు భగవంతుడు అందించే అపారమైన అనుగ్రహానికి ఈ సేవ నిదర్శనమని పండితులు చెబుతుంటారు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల పూర్వ జన్మల పాపాలు తొలగిపోవడమే కాకుండా, మనశ్శాంతి, సకల ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.












Click it and Unblock the Notifications