గన్ మిస్ఫైర్: సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి, ఆత్మహత్యా, ప్రమాదమా..?
విశాఖపట్నం: విశాఖపట్నంలోని జీకేవీధి పోలీస్ స్టేషన్ పరిధిలో సీఆర్పీఫ్ కానిస్టేబుల్ అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు. గురువారం ఉదయం మాక్ డ్రిల్ నిర్వహిస్తుండగా తుపాకీ మిస్ ఫైర్ అయి జవాన్ అజయ్ కుమార్ భుజం కింద నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది.
దీంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని సమీపంలోని చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సీఆర్పీఫ్ కానిస్టేబుల్ అజయ్ కుమార్ మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
సర్వీస్ తుపాకీని శుభ్రం చేస్తున్న క్రమంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చనిపోయారని పోలీసులు చెబుతున్నప్పటికీ... ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి మరణించాడా? లేక ఆత్మహత్య చేసుకుని మరణించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అజయ్ కుమార్ సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అతడి సహచరులు అనుమానిస్తున్నారు. మృతి చెందిన సీఆర్పీఫ్ కానిస్టేబుల్ అజయ్ కుమార్ 42వ బెటాలియన్కు చెందిన ఉత్తర ప్రదేశ్ నివాసి.
మామా అల్లుళ్ల మధ్య ఘర్షణ
తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలో మామ అల్లుడి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మామ పొడిచిన కత్తిపోట్లకు గాను అల్లుడు మరణించాడు. మామకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మామను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.