మహారాష్ట్ర , హర్యానాలలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్న జీవీఎల్
ఉత్తరాదిన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. కర్నాటక తరహా పరిస్థితి హర్యానాలో రాదనీ ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, హర్యానాలలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ నేత ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. గతంలో హర్యానాలో బీజేపీ ఎలాంటి ప్రభావం చూపకపోయినా ఈసారి అంతకంటే మెరుగైన ఫలితాలు రాబట్టిందని తెలిపారు. అక్కడ స్థానిక పరిస్థితులే హర్యానా ఫలితాలకు కారణం అని ఆయన పేర్కొన్నారు.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలుండగా 64 స్థానాల్లో గెలిచిన బీజేపీ మరో 98 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు గాను 26 స్థానాలు మాత్రమే నెగ్గి 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. హర్యానాలో కాంగ్రెస్ 16 స్థానాల్లో నెగ్గి, 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.అయితే హర్యానాలో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోయినా కర్ణాటక తరహా పరిస్థితి మాత్రం రాదనీ చెప్తున్నారు జీవీఎల్ .
గతంలో హర్యానాలో బీజేపీ రెండు స్థానాలు కూడా గెలవలేదని తెలిపిన ఆయన అయినప్పటికీ 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. మహారాష్ట్రలో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని జీవీఎల్ నరసింహారావు అన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు.