బెజవాడ టీడీపీలో కలకలం, చర్చ: ఒకే కారులో హరికృష్ణ, కొడాలి నాని
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేవనుంది. ఏంటీ ఆ చర్చ అని ఆశ్చర్యపోతున్నారా? టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు బావ, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)లు ఒకే కారులో రావడమే.
విజయవాడ బందరు రోడ్డులో కొత్తగా నిర్మించిన వెటర్నిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హరికృష్ణతో కలిసి కొడాలి నాని వచ్చారు. వారిద్దరూ ఒకే కారులో రావడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఎన్టీఆర్కు వీరాభిమానిగా అయిన కొడాలి నాని... హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లకు అత్యంత సన్నిహితుడు. కొడాలి నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వైసీపీ తరుపున గుడివాడ నియోజక వర్గం నుంచి గెలిచారు. కాగా, అసంతృప్తిగా ఉన్నప్పటికీ హరికృష్ణ టీడీపీలోనే కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి ఒకే కారులో ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సందర్భంగా కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరైన హరికృష్ణను కలిసి వెళ్లేందుకే వచ్చానని ఆయన అన్నారు.
తన భేటీలో రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పిన కొడాలి నాని హరికృష్ణను కలిసేందుకే వచ్చానని చెప్పారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని అన్నారు. సుమారు రూ. 3.08 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్కు మాజీ ఎంపీ, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లా కలెక్టర్ చొరవతో రాజ్యసభ ఎంపీగా ఉన్న నందమూరి హరికృష్ణ కలిసి ఎంపీ లాడ్స్ నిధులను విడుదల చేయాల్సిందిగా కోరడంతో హరికృష్ణ ఈ భవంతి కోసం ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ. 1.70 కోట్లను విడుదల చేశారు. దీంతో ఈ భవంతికి ఆయన పేరు పెడదామని ఆలోచించారు.
ఆ తర్వాత ఈ భవంతికి నందమూరి తారకరామరావు సూపర్ స్పెషాలిటీ వైద్యశాలగా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భవనంలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సంచాలకుడి కార్యాలయంతోపాటు ఆసుపత్రి కూడా ఉంది. రాబోయే రోజుల్లో మరో రూ. 5 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడే ఆధునిక పశువ్యాధుల నిర్ధారణ పరిశోధనాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.