భారతీయులు ఉన్న నౌకపై ఇరాన్ కాల్పులు.. రంగంలోకి భారత్..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. హార్మూజ్ జలసంధిలో ఆధిపత్యం కోసం ఇరాన్- అమెరికా దాడులను ఉద్ధృతం చేశాయి. తాజాగా ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై ఇరాన్ కు చెందిన కోస్ట్ గార్డ్ సైన్యం కాల్పులు జరిపింది. ఆ సమయంలో నౌకలో 17 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. అయితే ఈ ఘటన ఏప్రిల్ 25 శనివారం జరిగిందని ప్రస్తుతం భారతీయ సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. టోగో జెండాతో హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న చిరోన్ 7 అనే కెమికల్ ట్యాంకర్ పై ఇరాన్ సైన్యం ముందస్తుగా కాల్పులు జరిపినట్లు భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారి, డైరెక్టర్ మన్ దీప్ సింగ్ రంధానా ధ్రువీకరించారు. ఒమన్ తీర ప్రాంతంలో షినాస్ పోర్ట్ వద్ద ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతం హార్మూజ్ జలసంధికి సౌత్ ఈస్ట్ లో ఉందని తెలిపారు.
ఈ ఘటనతో హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ఏ స్థాయిలో ఉన్నాయో మరోసారి స్పష్టం అవుతోంది. హార్మూజ్ జలసంధిని బ్లాకేడ్ చేయడంలో అటు ఇరాన్ ఇటు అమెరికా తీవ్రంగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతవారంలోనూ విదేశీ జెండాలు కలిగి ఉన్న మూడు నౌకలపై ఇరాన్ సైన్యం దాడులు చేసింది. వాటిలో దాదాపు 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. అంతకుముందు ఏప్రిల్ 18 న భారత్ జెండాలు కలిగిన రెండు నౌకలపై ఇరాన్ నౌకాదళం దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.

అయితే అమెరికా సైన్యం.. ఇరాన్ కు చెందిన చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవడానికి ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులకు పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతోంది. మరోవైపు తమ పోర్టులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధాన్ని ఇరాన్ ఆర్మ్ డ్ పైరసీ అని తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు హార్మూజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా పెర్షియన్ గల్ఫ్ లో చిక్కుకున్న 14 భారతీయ నౌకలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం.. ఇరాన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు భారత్ కు చెందిన 10 నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయి.












Click it and Unblock the Notifications