ఎన్నినో ప్రభావం: తిరుమలలో అయిదు రోజులు వరుణయాగం, ప్రత్యేకతలు..!!
TTD కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాభావ పరిస్థితుల వేళ తిరుమలలో వరుణయాగం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీ వరుణయాగం నిర్వహించింది. ఈ సారి అయిదు రోజుల పాటు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్న టీటీడీ.. ఈ మేరకు తుది కసరత్తు చేస్తోంది. ప్రత్యేక మైన నియమ నిబంధనలతో ఈ వరుణయాగం నిర్వహిస్తారు. ఈ యాగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అవుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షపాత లోటు కనిపిస్తోంది. దీంతో.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం లో పంటలు పండి, సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ ఈ నెల 30వ తేదీ నుంచి అయిదు రోజుల పాటు ధర్మగిరి వేదపాఠశాలలో వరుణయాగాన్ని నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వర్షాలు పడి నీటి సమస్య లేకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ ధర్మగిరి వేదవిజ్ఞానపీఠం ఆధ్వర్యంలో వరుణయాగాన్ని నిర్వహించాలని ముహుర్తాన్ని నిర్ణయించారు. ఇందులో భాగంగా వేదవిజ్ఞానపీఠంలో యాగకర్త, రుత్వికుల సమక్షంలో ఆగస్టు 30, 31, సెప్టెంబరు 1, 2, 3 తేదీల్లో వరుణయాగాన్ని నిర్వహించనున్నారు.

అయిదు రోజులు యాగం.. ప్రత్యేక క్రతువు
ఇప్పటికే దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ ఉతర్వులు జారీ చేయగా, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు అయిదు రోజులపాటు ఈ యాగం .. క్రతువు నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖ రుత్వికలు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం యాగం నిర్వహిస్తారని అధికారులు వివరించారు. కాగా, ఈ నెలలోనే తిరుమలలో రెండు సార్లు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. గరుడ పంచమి, శ్రావణ పౌర్ణమి రోజున మాడ వీధుల్లో శ్రీవారి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇక.. ఈ ఏడాది రెండు సార్లు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. వచ్చే నెలలో జరిగే బ్రహ్మోత్సవాల వేళ పెద్ద ఎత్తున కొత్త నిర్మాణాలు.. వసతి సముదాయాలను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.













Click it and Unblock the Notifications