ప్రజాకంటకులే: రాష్ట్ర విభజనపై హరికృష్ణ బహిరంగ లేఖ
మూడు పేజీల లేఖను విడుదల చేసిన హరికృష్ణ, ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్ర విభజన చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు సహకరించే ప్రతి నేత ప్రజా కంఠకుడే అని ధ్వజమెత్తారు. రాష్ట్ర సమైక్యతనే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరూ కోరుకోవడం లేదన్నారు.
జల వివాదాలు పరిష్కరించకుండా రాష్ట్రాన్ని విభజిస్తే కృష్ణా, గోదావరి నదుల్లో నీటికి బదులు నెత్తురు ప్రవహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను మభ్య పెడుతున్న కాంగ్రెసు 2014లో ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం ప్రజల వద్దకు వస్తుందని ప్రశ్నించారు. తనతో పాటు అందరూ రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. దేవుడిని కూడా వివాదాల్లోకి లాగారని, ఇది సరికాదని, ఎన్టీఆర్ సమైక్యవాదమే తనదన్నారు.
కాగా, నందమూరి హరికృష్ణ సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ కొంతకాలం క్రితం ఆమోదించారు.
సిడబ్ల్యూసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత హరికృష్ణ విభజనపై మొదటిసారి లేఖ రాశారు. బాధాకరమైనా తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవించి అంగీకరిస్తున్నట్లు లేఖను విడుదల చేశారు. ఆ తర్వాత సీమాంధ్రలో ఆందోళన జరిగింది. దీంతో తాను సమైక్యానికే కట్టుబడి ఉంటున్నానని మరో లేఖ రాసి, రాజీనామా చేశారు.