ఆంధ్ర విత్తనమే: హరీష్, నవ్వుతూ వెళ్లిన కిరణ్ రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావుకు మధ్య శుక్రవారం శాసనసభ ఆవరణలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. తాను హైదరాబాదీనా, సీమాంధ్ర వాడిని అని కిరణ్ కుమార్ రెడ్డి హరీష్ రావును అడిగారు. దానికి హరీష్ రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రికి ధర్మ సందేహం వచ్చిందని, తాను ఏ ప్రాంతంవాడినో తేల్చుకోలేకపోతున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. మట్టి ఇక్కడిదైనా విత్తనం ఆంధ్రదేనని ఆయన అన్నారు. మట్టి మారినంత మాత్రాన విత్తనం రూపు మారదని ఆయన అన్నారు. తెలంగాణలో పుట్టి పెరిగినంత మాత్రాన ముఖ్యమంత్రి తెలంగాణ వ్యక్తి కాలేరని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర వ్యక్తేనని, సీమాంధ్రకే కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అని ఆయన వ్యాఖ్యానించారు. హరీష్ రావు వ్యాఖ్యలకు కిరణ్ కుమార్ రెడ్డి నవ్వుతూ వెళ్లిపోయారు.

హరీష్ రావుపై కేసు
ఇదిలావుంటే, హరీష్ రావుపై హైదరాబాదులోని రాయదుర్గ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. విధినిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుల్పై చేసిన వ్యాఖ్యలకు ఆయనపై కేసు నమోదైంది. ఇటీవల గేమింగ్ యానిమేషన్ పార్కుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన సందర్భంగా ధర్నా చేస్తున్న హరీష్ రావు, ఇతర తెరాస శాసనసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఓ పోలీసు కానిస్టేబుల్ను ఉద్దేశించి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications