ఆంధ్రా బాబుకు ఓటేసినట్లే, ఎర్రచందనం ఆస్తిలో: హరీష్
మెదక్: బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి ఓటు వేస్తే ఆంధ్ర బాబుకు వేసినట్లేనని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు శనివారం అన్నారు. జగ్గారెడ్డికి ఓటేస్తే బెజవాడ బాబుకు వేసినట్టేనన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మురికి కుంటలోకి పోతుందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నిక కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయనుందని, ఈ విషయాన్ని మరువరాదని ఓటర్లకు విన్నవించారు.
తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఆయన ప్రధాని అయిన తర్వాత జరిగిన తొలి పార్లమెంటు సమావేశాల్లోనే పోలవరంను ఏపీలో కలిపేశారని మండిపడ్డారు. హైదరాబాదు ఆస్తుల్లో వాటా కావాలని ఏపీ ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు అడగటం దారుణమన్నారు.
తెలంగాణ ప్రజల తాత, ముత్తాతలు కట్టిన పన్నులతో నిజాం ప్రభువు సచివాలయం, ఉస్మానియా ఆసుపత్రిల్లాంటివి కటటించారన్నారు. ఇలాంటి వాటిపై ఆంధ్రా వారికి అధికారం ఎక్కడిదన్నారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనానికి టెండర్లు పిలిచారని, ఆ డబ్బులతో తెలంగాణకు వాటా ఇస్తారా అన్నారు.
హైదరాబాదు ఆస్తుల్లో వాటా అడిగితే తాము ఎర్రచందనం ఆస్తిలో వాటా అడుగుతామన్నారు. జగ్గారెడ్డి, ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి వంటి వారిని ఏజెంట్లుగా పెట్టుకొని తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు. కిషన్ రెడ్డి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కిషన్, బీజేపీ పైన ఈసికి ఫిర్యాదు చేస్తామన్నారు.