విజయమ్మ బర్త్ డే స్పెషల్ - కుమార్తె షర్మిలతో కలిసి : సీఎం జగన్ తాడేపల్లి నుంచి..!!
వైసీపీ గౌరవాధ్యక్షురాలు...సీఎం జగన్ తల్లి విజయమ్మ జన్మదినం నేడు. అభిమానుల మధ్య విజయమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పాదయాత్రలో ఉన్న షర్మిల వద్దకు విజయమ్మ వెళ్లారు. కొత్తగూడెం జిల్లా భద్రాద్రి లక్ష్మీదేవిపల్లిలో వైఎస్ షర్మిల పాదయాత్ర క్యాంపు వద్ద వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రస్తుతం కొత్తగూడెం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ రోజున షర్మిల లక్ష్మీదేవిపల్లి మండలం రేగుళ్లలో నిరుద్యోగ నిరాహార దీక్షలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు.
తల్లి జన్మదిన వేడుకల్లో షర్మిల
కుమార్తెను కలిసిన సమయంలో షర్మిల తన తల్లితో కేక్ కట్ చేయించారు. ముద్దాడి బర్త్ డే విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే మామ్ అంటూ ట్వీట్ చేసారు. ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇక, వైసీపీ ముఖ్యనేత విజయసాయి రెడ్డి సైతం విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసారు. అందులో..జగన్ ను విజయమ్మ ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసారు. ట్వీట్ లో... వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మహానేతకు ఆదర్శ సతీమణిగా నిలిచారు. జననేతకు జన్మనిచ్చి ధన్య మాత అయ్యారు.
పాదయాత్రలో కుమార్తెతో విజయమ్మ
ఈ సందర్భంగా మీకు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నా...అంటూ పేర్కొన్నారు. సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయల్దేరి కొద్ది సేపటి క్రితం విశాఖ చేరుకున్నారు. అక్కడ హరియాణా సీఎం మనోహర్లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. విజయమ్మ ఈ మధ్య కాలంలో ఎక్కువగా షర్మిలతోనే ఉంటున్నట్లుగా తెలుస్తోంది.
వైసీపీ ప్లీనరీకి హాజరవుతారా
షర్మిల పాదయాత్ర చేస్తుండటంతో.. అప్పుడప్పుడూ వెళ్లి కలుస్తున్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, జూలై 8న వైఎస్సార్ జన్మదినం సందర్బంగా వైసీపీ ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు. జగన్ తన పాదయాత్రకు ముందు పార్టీ ప్లీనరీ నిర్వహించారు. అందులో విజయమ్మ - షర్మిల హాజరయ్యారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను సైతం అదే వేదిక నుంచి పార్టీ నేతలకు పరిచయం చేసారు. ఈ సారి పార్టీ ప్లీనరీకి సైతం విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్ష హోదాలో హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు.