జగన్ సర్కార్ కు హైకోర్టు ఫైనల్ వార్నింగ్-సెప్టెంబర్ 15 డెడ్ లైన్-దాటితే కోర్టు ధిక్కారం
ఏపీలో ఉపాధి హామీ బిల్లుల బకాయిల వ్యవహారం అధికార, విపక్షాల మధ్య హైకోర్టు వేదికగా కుదిపేస్తోంది. టీడీపీ హయాం నాటి ఉపాధి హామీ బిల్లుల్ని చెల్లించకుండా తప్పించుకుంటున్న వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే పలుమార్లు ఉపాధి హామీ బిల్లుల బకాయిపై హైకోర్టు అక్షింతలు వేసింది. అయినా బిల్లులు చెల్లించకపోవడంతో హైకోర్టు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసింది.

ఉపాధి హామీ బిల్లుల బకాయి
ఏపీలో టీడీపీ హయాంలో చేపట్టిన ఉపాధి హామీ పనుల బిల్లుల్ని వైసీపీ సర్కార్ ఇప్పటికీ పూర్తిగా చెల్లించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ఈ బిల్లుల్ని చెల్లించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఆరు నెలల క్రితమే హైకోర్టు జోక్యం చేసుకుని ఈ బిల్లులన్నీ చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినా, ఐఏఎస్ అధికారుల్ని హైకోర్టుకు పిలిపించినా ఇప్పటికీ ఈ బిల్లులు పూర్తిగా చెల్లించలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం అధికారం పూర్తయ్యేలోపు ఈ బిల్లుల చెల్లింపు జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోసారి హైకోర్టు సీరియస్
ఏపీలో ఉపాధి హామీ బిల్లుల బకాయిపై వైసీపీ సర్కార్ ను ఇప్పటికే పలుమార్లు హైకోర్టు ఆక్షేపించింది. దీంతో ఓసారి కేంద్రం నిధులు విడుదల చేయలేదంటూ, మరోసారి తాము బిల్లుల మొత్తాన్ని సర్పంచ్ ల ఖాతాల్లో జమ చేశామంటూ, ఇంకోసారి మరే ఇతర కారణాలతో వైసీపీ సర్కార్ తప్పించుకుంటోంది. దీంతో ఈసారి హైకోర్టు వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడింది. ఇన్నిసార్లు చెప్పినా ఉపాధి హామీ బిల్లుల బకాయిలు చెల్లించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. దీంతో తదుపరి చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

హైకోర్టు ఫైనల్ వార్నింగ్
ఏపీలో ఉపాధి హామీ బిల్లుల బకాయిల చెల్లింపుపై ఇప్పటికే పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం వాటిని పూర్తిగా అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహంగా ఉంది. దీంతో హైకోర్టు ఈ బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వానికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసింది. అదే సమయంలో బిల్లుల చెల్లింపు కోసం తుది గడువు కూడా పెట్టేసింది. ఈ గడువు లోపు ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేయకపోతే తీసుకునే చర్యల్ని సైతం ఇవాళ ప్రకటించింది. దీంతో హైకోర్టు తీసుకోబోయే నిర్ణయాలపై ఉత్కంఠ మొదలైంది. ప్రభుత్వం మాత్రం ఎప్పటిలాగే బిల్లులు త్వరలో క్లియర్ చేస్తామని చెబుతోంది.

సెప్టెంబర్ 15 డెడ్ లైన్, దాటితే కోర్టు ధిక్కార చర్యలే
ఉపాధి హామీ బిల్లుల బకాయిల చెల్లింపు విషయంలో ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన హైకోర్టు ఇవాళ ఫైనల్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు డెడ్ లైన్ కూడా పెట్టేసింది. సెప్టెంబర్ 15లోపు గత ప్రభుత్వంలో జరిగిన ఉపాధి హామీ పనుల బిల్లులు బకాయిలన్నీ చెల్లించాల్సిందేనని హైకోర్టు డెడ్ లైన్ పెట్టేసింది. దీంతో ప్రభుత్వం కచ్చితంగా ఆ లోపు బిల్లులు క్లియర్ చేయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అదే సమయంలో సెప్టెంబర్ 15లోపు బిల్లులు చెల్లించడంలో విఫలమైతే ఆ తర్వాత కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హైకోర్టు జగన్ సర్కార్ ను హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేస్తుందా లేక కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధపడుతుందా అనేది ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications