కౌన్సెలింగ్: సుప్రీంలో ఇంప్లీడ్, చైర్మన్కు ఓయు సెగ
హైదరాబాద్: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్కు ఉన్నత విద్యామండలి జారీ చేసిన నోటిఫికేషన్ వివాదంగా మారుతోంది. కౌన్సెలింగ్కు హాజరు కాకూడదని తెలంగాణ విద్యా మంత్రి జగదీష్ రెడ్డి తమ రాష్ట్ర విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ స్థితిలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గురువారంనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావుతో సమావేశమయ్యారు.
ఎంసెట్ కౌన్సెల్సింగ్పై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో ఇంప్లీడ్ కావాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించుకుంది. రేపు శుక్రవారం సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ఆ కేసు ఈ నెల 4వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు వస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో జాప్యం చేస్తుందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే అడ్మిషన్లు జరుపుతామని ఆయన చెప్పారు. రెండు మూడు రోజుల్లో కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస రావు చెప్పారు.
అయితే, ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు వేణుగోపాల్ రెడ్డి ఛేంబర్ వద్ధ ధర్నాకు దిగారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేయడానికి ఉన్నత విద్యామండలి కుట్ర చేస్తోందని ఓయు విద్యార్థులు ఆరోపించారు. ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పు రాకుండా నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారని వారు ప్రశ్నించారు.