కేసు పెడతామని తెలంగాణ హెచ్చరించింది: ఫోన్ ట్యాపింగ్పై సర్వీస్ ప్రొవైడర్లు
విజయవాడ: ఓటుకు నోటు నేపథ్యంలో తెరపైకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఆసక్తికరమైన వాదనలు వినిపించినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పైన మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో శుక్రవారం వాదనలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా టెలికం సర్వీస్ ప్రొవైడర్ల తరఫు న్యాయవాదులు, ప్రభుత్వ అడ్వోకేట్ జనరల్ హాజరయ్యారు. 174 సెక్షన్ ప్రకారం సర్వీస్ ప్రొవైడర్ల పైన చర్యలు తీసుకోవాలని ఏజీ (అడ్వోకేట్ జనరల్) న్యాయస్థానాన్ని కోరారు.
కాగా, సర్వీస్ ప్రొవైడర్లు ఆసక్తికర వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం కాల్ డేటా ఇవ్వవద్దని మెమో ఫైల్ చేసిందని, డేటా ఇస్తే ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించిందని చెప్పారు. అందుకే కాల్ డేటా ఇవ్వలేమని సర్వీస్ ప్రొవైడర్లు కోర్టుకు చెప్పారు.
కేంద్రం కూడా సమాచారం ఇవ్వవద్దని ఆదేశించిందని లాయర్లు చెప్పారు. కేంద్రం ఉత్తర్వులు కోర్టును నిర్దేశించలేవని ప్రాసిక్యూషన్ వాదించింది. కాల్ డేటా రెండు నెలల తర్వాత డిలీట్ అవుతుందని అడ్వోకేట్ జనరల్ చెప్పారు. దీనిపై గతంలో సుప్రీం ఉత్తర్వులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. కాగా, తమకు వారం రోజుల సమయం కావాలని సర్వీస్ ప్రొవైడర్లు విజ్ఞప్తి చేశారు.