వాయుగుండంతో ఏపీ విలవిల
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల ఏపీలో పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ జిల్లాల వరకూ భారీ వర్షాలు దంచికొట్టాయి. ప్రత్యేకించి- రాయలసీమలో అత్యధిక వర్షపాతం నమోదైంది. నేడు కూడా వర్షాల తీవ్రత కొనసాగనుంది. ఎగువ, పరీవాహక ప్రాంతంలో తాజాగా భారీ వర్షాలు పడటం వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని దాల్చింది. శ్రీశైలం రిజర్వాయర్ కు వరదజలాలు పోటెత్తుతున్నాయి.
వాయువ్య- దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర అల్పపీడనం చురుగ్గా కదులుతోంది. పశ్చిమ- వాయువ్య దిశగా విస్తరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా దక్షిణం-ఉత్తరాంధ్ర తీరం వద్ద వాయుగుండంగా బలపడింది. ఈ తెల్లవారు జాము నాటికి ఒడిశాలోని పూరీకి 60, గోపాల్పూర్- 70, ఏపీలోని కళింగపట్నానికి- 180 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 10 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం తీరం వైపు కదులుతోంది.

గోపాల్పూర్ సమీపంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర మధ్య ఈ వాయుగుండం తీరాన్ని దాటనుంది. వాయుగుండం తీరానికి సమీపిస్తోన్న సమయంలో గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం ఉదయం 8:30 గంటల నుండి ఈ తెల్లవారు జామున 6 గంటల వరకు 5.1 మిల్లీ మీటర్ల మేర సగటు వర్షపాతం నమోదైంది. కర్నూలు జిల్లా ఆదోనిలో అత్యధిక వర్షపాతం రికార్డయింది. ఇక్కడ 115.7 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
కృష్ణా జిల్లా బాపులపాడులో 103.7, అనంతపురం జిల్లా ఆత్మకూరు- 96.5, కర్నూలు జిల్ల క్రిష్ణగిరి- 89, నంద్యాల జిల్లా మహానంది-86.2 మి.మీ. వర్షపాతం కురిసింది. అదే జిల్లాలోని పాణ్యం- 82.5, కర్నూలు జిల్లా పెద్దకడుబూరు- 79, అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక- 78.2, కర్నూలు జిల్లా దేవనకొండ- 75, వెల్దుర్తి- 74.2 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసినట్లు విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.












Click it and Unblock the Notifications