తిరుమల గిరుల్లో సరికొత్త అందాలు: ఉప్పొంగిన కపిలతీర్థం
తిరుపతి: పరమ పవిత్రమైన తిరుమల గిరులు సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. చిత్తూరు జిల్లావ్యాప్తంగా రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కపిలతీర్థం ఉప్పొంగింది. శేషాచలం కొండల్లో కురిసిన భారీ వర్షాల వల్ల కపిలతీర్థం ఇదివరకు ఎప్పుడూ లేనంత ఉదృతిని సంతరించుకుంది. ఆకాశగంగను తలపిస్తోంది. ఏడు కొండలను దాటుకుని తిరుపతిలోని కపిలతీర్థం ఆలయం వద్ద నేలను తాకుతోంది. పదేళ్లుగా ఈ స్థాయి ప్రవాహాన్ని ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. కపిలతీర్థం జలపాత ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయానికి వచ్చే భక్తులను ఎవ్వరినీ కోనేరులోకి దిగనివ్వట్లేదు అర్చకులు, అక్కడి సిబ్బంది. జలపాతం వద్ద స్నానం ఆచరించడాన్ని నిషేధించారు. కపిలతీర్థంతో పాటు మాలవాని గుంట జలపాతం కూడా వరద ప్రవాహాన్ని అందిపుచ్చుకుంది.
48 గంటలుగా జిల్లా వ్యాప్తంగా..
చిత్తూరు జిల్లాలో శని, ఆదివారాల్లో ఎడతెరిపి లేని వర్షాలకు కురిశాయి. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, తంబళ్లపల్లి, కురబలకోట, శ్రీకాళహస్తి, ఏర్పేడు, బీ.కొత్తకోట, పలమనేరు, కుప్పం వంటి మండలాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. కుప్పం సమీపంలో పాలార్ నదికి వరదనీరు చేరింది. జిల్లాలోని దాదాపు అన్ని వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. సోమవారం సైతం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్లు సమాచారం ఉంది. పిచ్చాటూరు, కార్వేటినగరం, వెదురకుప్పం, నగరి, వడమాలపేట తదితర మండలాల్లో కురిసిన వర్షాలకు వంకలు ప్రవహించాయి.
ఫలితంగా చెరువుల్లోకి నీరు చేరింది. తిరుమలలో భారీ వర్షాలకు కురుస్తున్నప్పటికీ భక్తులు లెక్క చేయట్లేదు. దేవదేవుని సందర్శించడానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. తిరుమల కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. అలిపిరి వైపు నుంచి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.