చంద్రబాబు విఫలమయ్యారు, నేను కూడా సిద్ధం: సినీ నటి హేమ
కాపుల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రముఖ సినీ నటి హేమ పిలుపునిచ్చారు.
రాజమహేంద్రవరం: కాపుల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రముఖ సినీ నటి హేమ పిలుపునిచ్చారు. ఆమె శనివారం నాడు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని చెప్పారు.
'తొక్కేస్తారన్న భయం లేదు.. ముద్రగడకు ఉడతాభక్తిగా నావంతు మద్దతు..'
ముద్రగడ ఆశయ సాధన కోసం తాను కూడా ఉద్యమంలో పాలుపంచుకుంటానని తెలిపారు. కాకినాడలో జరిగిన కాపు మహిళా సదస్సులో పాల్గొని, అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చినట్లు చెప్పారు.
రాజకీయాల్లో అడుగు..
జై సమైక్యాంధ్ర పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటి చేసి విఫలమైన సినీ నటి హేమ.. ఆ తర్వాత రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించలేదు. కనీసం తన నోటి వెంట ఎప్పుడూ రాజకీయాలను ప్రస్తావించిన దాఖలా కూడా లేదు.
ముద్రగడకు మద్దతు
ఇటీవల హేమ రాజకీయాల గురించి ప్రస్తావిస్తున్నారు. టిడిపికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ ను సమర్థిస్తూ.. ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.
కాపులకు అండ
గురువారం నాడు జరిగిన కాపు మహిళా సదస్సులో ఆమె పాల్గొన్నారు. ముద్రగడకు ఉడతాభక్తిగా తనవంతు సహాయం అందించేందుకే తనకు తానుగా సదస్సుకు వచ్చానని చెప్పారు. కాపు ఉద్యమంలో పాల్గొంటే సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా తొక్కేస్తారన్న భయం తనకు లేదన్నారు.
కాపు రిజర్వేషన్
గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామిని గుర్తుచేస్తూ.. కాపులను బీసీల్లో చేరుస్తామన్న మేనిఫెస్టోను గుర్తెరిగి కూడా మిగతా కులాల నాయకులు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారని హేమ ప్రశ్నించారు. సదస్సులో పాల్గొన్నవారంతా కంచాలను గరిటెలతో కొడుతూ నిరసన తెలిపారు. మొత్తానికి కాపు ఉద్యమానికి తనవంతుగా మద్దతు ప్రకటించిన హేమ.. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారే ప్రయత్నమేమైనా చేస్తారా? అన్నది వేచి చూడాలి.