కర్నాటకలో బీజేపీ గెలిస్తే బాధవద్దు: ఎందుకో చెప్పిన శివాజీ, 'జనసేన ఎందుకు రాలేదు'
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ నటుడు శివాజీ విజయవాడలోని ధర్నా చౌక్లో జాగారం దీక్ష చేపట్టారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. శివాజీ దీక్షకు ఏపీ ఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావులు మద్దతు తెలిపారు.
చదవండి: పవన్ కళ్యాణ్ పార్టీలో చేరకుండా అందుకే బీజేపీలోకి!: చంద్రబాబుపై మాధవీలత ఫైర్
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు ఒకే గొడుకు కిందకు రావాలన్నారు. బీజేపీ ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఏపీకి రాజధాని లేకుండా, ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీ లేకుండా కాంగ్రెస్ ఇచ్చిందని, మేం న్యాయం చేస్తామని బీజేపీ అప్పుడు చెప్పిందని గుర్తు చేశారు.
చదవండి: ఏవీకి నామినేటెడ్ పోస్ట్: ఇస్తే దేనికైనా రెడీ.. అఖిల సంకేతాలు? అధిష్టానం అసహనం
ఏపీని ఆకాశమంత ఎత్తుకు ఎదిగిస్తామన్నారు
ఏపీని ఆకాశమంత ఎత్తుకు ఎదిగిస్తామని నమ్మబలికిన బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ తీవ్రంగా మోసం చేసిందని శివాజీ మండిపడ్డారు. ఇంకా మనం ఎంత కాలం మౌనంగా ఉందామని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు తమకు అవసరమైనట్లు ఉద్యమాలు చేస్తున్నాయని, తప్ప నిర్ణయాత్మక ఉద్యమాలు చేయడం లేదన్నారు.
కర్నాటకలో బీజేపీ గెలిస్తే బాధపడొద్దు
ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాల పట్ల దేశ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, కర్ణాటకలో బీజేపీ గెలిచినా బాధపడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే 2019 ఎన్నికల్లో మోడీకి దేశ ప్రజలు బుద్ధి చెబుతారని శివాజీ అంతకుముందు అన్నారు. ఏపీ ప్రజలను బిచ్చగాళ్లలా కేంద్రం చూస్తోందన్నారు. ఏపీలోని రాజకీయపార్టీలన్నీ ఒకే వేదికపైకి వచ్చి పోరాడాలన్నారు.
బీజేపీతో లోపాయికారిగా కొన్ని పార్టీలు పని చేస్తున్నాయి
మన పిల్లల భవిష్యత్తు కోసం మన హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని శివాజీ అన్నారు. రాష్ట్రంలోని కొన్ని పార్టీలు బీజేపీతో లోపాయికారిగా పని చేస్తున్నాయని వైసీపీ, జనసేనలను ఉద్దేశించి అన్నారు. ఆ పార్టీలు హోదా కోసం పోరాడుతున్నట్టు నటిస్తున్నాయన్నారు. ఏపీకి హోదా, విభజన హామీలు అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
అశోక్ బాబు హెచ్చరిక
శివాజీ దీక్ష సందర్భంగా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు మాట్లాడుతూ.. ప్రజలకు నష్టం జరగకుండా ఉద్యమం చేయాలన్నారు. హోదాపై ఒక్కో పార్టీ ఒక్కో దారిలో ఉద్యమం చేస్తోందన్నారు. ఉద్యమం చేయడానికి ఉద్యోగులు ఎప్పుడూ వెనకడుగు వేయలేదన్నారు. హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అన్ని పార్టీలు కలిసి బలమైన ఉద్యమం చేయాలన్నారు. అన్ని పార్టీలు కలిసి రాకపోతే ప్రజా వ్యవస్థలతో కలిసి పోరాడతామని హెచ్చరించారు.
జనసేన, వైసీపీ ఎందుకు రాలేదు
దీక్ష సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ.. టీడీపీ అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లడం లేదని అంతకుముందు చెప్పారని, కానీ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే బీజేపీ, జనసేన, వైసీపీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు వచ్చాయన్నారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కారని విపక్షాలను ఉద్దేశించి మండిపడ్డారు. కేంద్రంతో లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. వారిని చూసుకొని బీజేపీ ఏపీకి అన్యాయం చేస్తోందన్నారు.