పవన్ కళ్యాణ్ పార్టీలో చేరకుండా అందుకే బీజేపీలోకి!: చంద్రబాబుపై మాధవీలత ఫైర్
హైదరాబాద్: ఇటీవలే బీజేపీలో చేరిన నటి మాధవీలత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై మంగళవారం విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పలుమార్లు మాట మార్చారని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కేంద్రం ఏపీకి ఎన్నో నిధులు ఇచ్చిందని చెప్పారు.
Recommended Video
చదవండి: ఓటుకు నోటులో ఏంలేదని కోర్టే చెప్పింది, ఏం చేస్తారో చూద్దాం, బాబుపై జగన్ కుట్ర: టీడీపీ షాకింగ్
ప్రత్యేక హోదా కంటే ఎక్కువగా నిధులు ఇస్తోందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు ఎవరైనా లెక్కలు చెప్పాల్సిందేనని ఆమె వెల్లడించారు. మాట మార్చడంలో చంద్రబాబు దిట్ట అని అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందనన్నారు. లారీ ఇసుక ఎత్తివేసినందుకు ఐదు లక్షల రూపాయల బిల్లు పెట్టారని విమర్శించారు.
చదవండి: 10 జిల్లాల్లో 40 రోజులు: పవన్ కళ్యాణ్ యాత్రకు లగ్జరీ బస్సు సిద్ధం, ఎన్నో సదుపాయాలు
అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం
తనకు పదవ తరగతి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని మాధవీలత అన్నారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి తాను ఈ పార్టీలో చేరానని వెల్లడించారు. అందుకే పవన్ పార్టీని కాదని కమలం తీర్థం పుచ్చుకున్నట్లు చెప్పారు. బీజేపీలో చేరినంత మాత్రాన పవన్పై అభిమానం తగ్గదన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎక్కడైనా పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమన్నారు.
నా కుటుంబంలో చాలామంది ఆర్మీలో, ప్రాంతీయ భావాల్లేవు
తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా జాతీయ స్థాయిలో పని చేయాలని ఉందని మాధవీలత అన్నారు. పార్టీ అవకాశం ఇస్తే తెలుగు రాష్ట్రాలలో ఎక్కడి నుంచి పోటీ చేసేందుకైనా సిద్ధమని ప్రకటించారు. తన కుటుంబంలో చాలామంది ఆర్మీలో పని చేస్తున్నారని, తనకు ఎలాంటి ప్రాంతీయ భావాలు లేవని చెప్పారు. తన సోదరుడు ఆర్మీలో ఉన్నాడని, ఈ నేపథ్యంలో బీజేపీలోని జాతీయ సమగ్రత తనకు నచ్చిందన్నారు. బీజేపీ ఏపీకి నష్టం చేస్తోందని తాను భావించడం లేదన్నారు. ఇదంతా వట్టి ప్రచారం అన్నారు.
కాస్టింగ్ కౌచ్పై ప్రశ్నిస్తా
మాధవీలత మంగళవారం నాడు ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. సినిమా పరిశ్రమలోని కాస్ట్ కౌచింగ్ పైన తాను ప్రశ్నిస్తూనే ఉంటానని మాధవీలత చెప్పారు. ఇప్పుడు తనకు పార్టీ బలం ఉంది కాబట్టి మహిళల అభివృద్ధికి మరింత తోడ్పడుతానని చెప్పారు.
ఇటీవలే బీజేపీలో చేరిన మాధవీలత
కాగా, మాధవీలత ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమెకు గడ్కరీ పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఆ సందర్భంలో ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలు అంటే తనకు ఆసక్తి అని చెప్పారు.