అలిపిరి నడకమార్గం, చిరుతల సంచారంపై మూడు రిస్క్ పారామీటర్లు గుర్తింపు
శ్రీనివాసులు కొలువుదీరిన శేషాచలం కొండల్లో వన్యప్రాణుల సంచారం సర్వసాధారణం. తరచూ అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో చిరుతలు, ఎలుగుబంట్లు కనిపిస్తుంటాయి. భక్తులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తుంటాయి. తిరుమల గిరులకు ఆనుకుని ఉన్న అలిపిరి, ఎస్వీ జూపార్క్, శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ క్యాంపస్ లల్లోనూ చిరుతలు కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీన్ని అడ్డుకోవడానికి గతంలో టీటీడీ చేపట్టిన చర్యలేవీ పెద్దగా ఫలించలేదు.
ఈ పరిణామాల మధ్య టీటీడీ పాలనా యంత్రాంగం మరోసారి.. చిరుతల సంచారంపై దృష్టి సారించింది. తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్ లో టీటీడీ, అటవీ శాఖ అధికారులతో అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమావేశం అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. చిరుతలు ఎక్కువగా సంచరించిన ప్రాంతాలు, ట్రాప్ కెమెరాలు, సోలార్ కెమెరాల పనితీరుపై టీటీడీ డీఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

అనంతరం వెంకయ్య చౌదరి మాట్లాడారు. అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, వన్యప్రాణుల సంచారాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వన్యప్రాణుల కదలికలపై సమగ్ర డేటాను విశ్లేషించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
చిరుతల సంచారం అధికంగా ఉండే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేయాలని, దీనికి అవసరమైన సిబ్బంది, ఆధునిక పరికరాలు, వాహనాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలను సమకూర్చాలని ఆదేశించారు. వాటి ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసి, భక్తులకు ప్రమాదం కలిగించే ప్రాంతాలను గుర్తించాలని, ఆయా చోట్ల తగిన నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు.
ఇప్పటికే గుర్తించిన మూడు రిస్క్ పారామీటర్లను అధ్యయనం చేయడంతో పాటు, వన్యప్రాణుల దాడి ప్రభావం, తీవ్రతను తగ్గించే కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. తిరుమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంఖ్య, వాటి సంచారాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు. అలిపిరి నడక మార్గంలోని దుకాణాల నిర్వహణ వల్ల భక్తుల భద్రతపై ఎలాంటి ప్రభావం పడుతోందో సమగ్రంగా అధ్యయనం చేయాలని, అవసరమైతే తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
వన్యప్రాణులు ఆహారం కోసం కాలిబాట, దుకాణాల సమీపంలోకి రాకుండా ఉండటానికి అక్కడి వ్యర్థాలను తొలగించాలని వెంకయ్య నాయుడు సూచించారు. వాటి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి వీలుగా టీటీడీ, అటవీ, విజిలెన్స్, ఇంజినీరింగ్, ఆరోగ్య శాఖలతో పాటు సంబంధిత అన్ని విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని వెంకయ్య చౌదరి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications