మండుతున్న ఏపీ
ఏపీని ఎండలు మండిస్తున్నాయి. ఫిబ్రవరి రెండోవారంలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే వేసవికాలం ఎలా ఉండనుందో ఊహించుకుంటేనే భయమేస్తోందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. శివరాత్రి వెళ్లకుండానే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ సంవత్సరం ఎండలు బాగానే ఉంటాయని వాతావరణశాఖ ఇటీవలే వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 38 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. వాస్తవానికి ఫిబ్రవరి నెలలో ఇంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండవు.
రాష్ట్రంలో వారం రోజుల నుంచి ఎండల తీవ్రగా అధికంగా ఉంటోంది. రాయలసీమలో మరింత ఎక్కువగా ఉంటున్నాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో 38 డిగ్రీల చొప్పున నమోదవుతున్నాయి. రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. ఇవి కూడా సాధారణంకన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. రాబోయే వేసవికాలంలో తీవ్ర వడగాడ్పులు కూడా తప్పవని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

పసిఫిక్ మహా సముద్రంలో బలంగా ఉన్న ఎల్నినోతో పాటు మరికొన్ని కారణాలు పగటి ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఫిబ్రవరిలో చిరుజల్లులు కురుస్తుంటాయి. దీనివల్ల ఎండ వేడిమి చాలా తక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం అటువంటి వాతావరణం కనపడటంలేదు. గతేడాది కంటే ఈ వేసవి ఎక్కువగా ఉంటుందని, పగటి సమయంలో అసాధారణరీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఈనెల 16వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, జూన్ నెలకు ఎల్నినో బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. ఉష్ణతాపం మే నెలాఖరు వరకు ఉంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications