సీబీఐకి స్కిల్ కేసు - హైకోర్టుకు ప్రభుత్వం క్లారిటీ..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేసుల వ్యవహారం కీలక మలుపు తిరుగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు సీబీఐకు ఇవ్వాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ రోజు మరో సారి కేసు విచారణకు వచ్చింది. ఇదే సమయంలో సీబీఐ విచారణకు ఇవ్వటానికి అభ్యంతరం లేదని ఏజీ కోర్టుకు స్పష్టం చేసారు. గత విచారణ సమయంలో కోర్టు ఆదేశించిన విధంగా నోటీసులు అందరికీ అందలేదని న్యాయవాదులు చెప్పటంతో కేసు వాయిదా వేసారు.
ఉండవల్లి పిటీషన్ తో:స్కిల్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రజా ప్రయోజనాల కారణంగా సీబీఐ విచారణకు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటీషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇప్పటికే 44 మంది ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ రోజు మరోసారి ఈ పిటీషన్ న్యాయస్థానం లోవిచారణకు వచ్చింది. దీనిపై న్యాయవాదులు కోర్టు ముందు ప్రస్తావిస్తూ... ఈ నోటీసులు అందరికీ అందలేదని పేర్కొన్నారు. నోటీసులను అందరికీ అందకపోవడంతో కేసు విచారణను హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ఆలస్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి సూచించారు. అయితే, ఏపీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి ఇవ్వటం పైన ఇప్పటికే హైకోర్టుకు స్పష్టత ఇచ్చింది.

ప్రభుత్వం స్పష్టత:ఈ కేసులో ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసు విచారణ ప్రత్యేక విచారణ టీంను ఏర్పాటు చేసామని ఏజీ కోర్టుకు నివేదించారు.ఈ కేసుకు సంబంధించి సీబీఐకు కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని ఏజీ కోర్టుకు వివరించారు. స్కిల్ కేసు సీబీఐ విచారణకు ఇవ్వడానికి తమకు అభ్యంతర లేదని ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. సీబీఐకి ఇవ్వాలని నాలుగేళ్ల క్రితమే తమ వైఖరి స్పష్టం చేసామని వెల్లడించారు. స్కిల్ స్కాం విచారణ సీఐడీ నుంచి..సీబీఐ విచారణకు ఇవ్వాలని రిట్ పిటిషన్ లో ఉండవల్లి కోరారు. ఈ కేసు వివిధ రాష్ట్రాలతో ముడిపడి ఉందని ఉండవల్లి వివరించారు. లోతైన విచారణ అవసరమంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఈడీ, సీబీఐ, ఏపీ ప్రభుత్వంతోపాటు స్కిల్ స్కాం నిందితులందరినీ ఉండవల్లి తన పిటీషనల్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
కోర్టు తీర్పుపై ఉత్కంఠ:ప్రస్తుతం సీఐడీ చేస్తున్న ఈ విచారణ విషయంలో కోర్టు తీసుకొనే నిర్ణయం కీలకం కానుంది. ఏపీ ప్రభుత్వం సైతం ఈ కేసును సీబీఐకు ఇవ్వటం తమకు అభ్యంతరం లేదని చెప్పటంతో... నోటీసులకు 44 మంది సమాధానాలు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అటు స్కిల్ కేసులో చంద్రబాబు రిమాండ్ రిపోర్టు..అరెస్ట్..17ఏ పైన సుప్రీంలో క్వాష్ పిటీషన్ విచారణ సాగుతోంది. ఇప్పటికే దీని పై సుప్రీంలో వాదనలు పూర్తయ్యాయి. దీపావళి సెలవుల తరువాత తీర్పు వెల్లడిస్తామని కోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబు ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చారు. ఇటు హైకోర్టులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటీషన్ లో నోటీసులు జారీ కావటంతో..స్కిల్ కేసులో రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications