9న మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్, ఓటుహక్కుపై వ్యాఖ్య
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ నెల 9వ తేదీలోగా కౌంటింగ్ నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలని ఎన్నికల సంఘాన్ని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో మున్సిపల్ కౌంటింగ్ తొమ్మిదో తేదిన ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫలితలు బుధవారం విడుదల కావలసి ఉండగా, సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మున్సిపల్ ఫలితాలను నిలిపివేయాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్పై మంగళవారం వాదోపవాదనలు జరిగాయి.
దీనిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. రేపు (బుధవారం) ఎన్నికలకు సంబంధించి ఫలితాల వెల్లడికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈసి కోర్టుకు తెలిపింది.
జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించి ఆ షెడ్యూల్లో మార్పు చేయాలంటూ సుప్రీం కోర్టు సూచనల మేరకు వాదనలు విన్న హైకోర్టు 9వ తేదీ లోపల కౌంటింగ్, ఫలితాలు ప్రకటించాలని న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్గు తీర్పుపై పిటిషనర్లు సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు.
కాగా, తీర్పు సమయంలో హైకోర్టు ఆసక్తికరమై వ్యాఖ్యలు చేసింది. ఓటర్లు ప్రభావితం అవుతారన్న పిటిషన్లు అసంబద్దమని కోర్టు చెప్పింది. ఓటుపై ఓ అభిప్రాయానికి రాని వ్యక్తి ఆ హక్కుకు అనర్హుడని కోర్టు పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోవన్నారు. న్యాయస్థానం గత నెల 3న ఇచ్చిన ఉత్తర్వులను మీరకుండా తొమ్మిదిలోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.
లెక్కింపుకు ఏర్పాట్లు
కోర్టు తీర్పు మేరకు ఈ నెల 9న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రమాకాంత్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. 9న ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు సవరణ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని చెెప్పారు. 8వ తేదీ ఉదయం వరకు కోర్టు ఆదేశాల కోసం వేచి చూస్తామని, ఆ తర్వాత ఓట్ల లెక్కింపుకు సిద్ధం అవుతామన్నారు. పురపాలక ఎన్నికల్లో 75 శాతం పోలింగ్ నమోదైందని, ఒకవేళ పిటిషనర్ సుప్రీంకు వెళ్లి వాయిదాపడితే కోర్టు ఆదేశాలను పాటిస్తామన్నారు. ఈవిఎంలకు భద్రత కల్పిస్తామన్నారు.