జగన్ పై హత్యాయత్నం కేసు విచారణ సోమవారానికి వాయిదా...మరో వ్యాజ్యం దాఖలు!
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత,వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణను హై కోర్టు ధర్మాసనం సోమవారంకు వాయిదా వేసింది.
జగన్ పై హత్నాయత్నానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై సోమవారం విచారణ జరుపుతామని ధర్మాసనం ప్రకటించింది. తనపై జరిగిన హత్నాయత్నానికి సంబంధించి థర్డ్ పార్టీ దర్యాప్తు జరిపించాలని కోరుతూ జగన్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఎపి ప్రభుత్వం ఇంతవరకూ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ప్రశ్నించింది. మరోవైపు జగన్ పై హత్యాయత్నంకు సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఎపి ప్రతిపక్ష నేత జగన్ పై కోడికత్తితో హత్యాయత్నం కేసు విచారణ సందర్బంగా హై కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తప్పుబట్టినట్లు తెలిసింది. ఈ కేసు విషయమైఅఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మాసనం సోమవారం కల్లా అఫిడవిట్ దాఖలు చేయాలని ఇటు ఏపీ ప్రభుత్వంతో పాటు అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.
మరోవైపు వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)దాఖలు చేశారు. ఈ కేసును ఏపీ పోలీస్ పరిధి నుంచి కేసును సీఐఎస్ఎఫ్కు బదిలీ చేయాలని, జాతీయ దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలని ఆయన తన పిటిషన్ లో కోరారు.
ఈ పిల్ లో ఆయన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి, పౌర విమానయాన కార్యదర్శి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ డీజీపీ, విశాఖ తూర్పు డివిజన్ పోలీసు అసిస్టెంట్ కమిషనర్, వైజాగ్ పోలీసు కమిషనర్, విశాఖ ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్ హౌస్ అధికారులను ప్రతివాదులుగా చేర్చినట్లు తెలిసింది. అయితే ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హై కోర్టు ఇవన్నీ ఒకే అంశానికి చెందినవి కావడంతో అన్ని పిటీషన్లను కలిపి సోమవారం విచారిస్తామని పేర్కొంటూ విచారణ వాయిదా వేసింది.