అమరావతిలో ఉత్కంఠ, హైకోర్టు తీర్పు రిజర్వ్ - సీఎం జగన్ టూర్ ఖరారు..!!
అమరావతిలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఆర్ -5 జోన్ లో పేదలకు ఇంటి పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపనకు ముహూర్తం ఖారరైంది. ఈ నెల 24న సీఎం జగన్ అమరావతిలో శంకుస్థాపనకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. అటు ఇదే అంశం పైన హైకోర్టులో వాదనలు జరిగాయి. కోర్టు ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. తీర్పు రిజర్వ్ చేసింది. ప్రజాధనం వృథా కాదని ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది.
ఆసక్తి కర పరిణామాలు: రాజధాని అమరావతిలోని ఆర్-5 జోన్లో పట్టాల పంపిణీ, ఇంటి నిర్మాణాల కొనసాగింపులో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇంటి స్థలాలు పంపిణీ చేసిన సీఎం జగన్..అక్కడ ఇంటి నిర్మాణాల శంకుస్థాపనకు ఈ నెల 24న అమరావతికి రానున్నారు. ఈ నెల 8న వైఎస్సార్ జన్మదినం నాడే ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించినా..24వ తేదీకి వాయిదా పడింది.

ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో హైకోర్టులో ఆర్ -5 జోన్ లో ఇంటి నిర్మాణాల పైన దాఖలైన పిటీషన్ల విచారణ జరిగింది. తుది తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రజాధనానికి ఎవరు బాధ్యత వహిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది.
హైకోర్టులో తీర్పు రిజర్వ్: ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో కోర్టు తుది ఉత్తర్వులు వెల్లడించకుండానే నిర్మాణంపై ముందుకెళ్లడాన్ని ఏవిధంగా సమర్థించుకుంటారని ప్రశ్నించింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. రైతుల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని పిటీషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. పేదల సంక్షేమం ముసుగులో మాస్టర్ ప్లాన్ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
ల్యాండ్ పూలింగ్ కింద సమీకరించిన భూములపై ప్రభుత్వానికి పూర్తి హక్కులు సంక్రమించలేదని కోర్టుకు నివేదించారు. ఇళ్లపట్టాల పంపిణీ నిమిత్తం సీఆర్డీఏ చట్టంలోని భూకేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా భూమిని జిల్లా కలెక్టర్లకు బదిలీ చేశారని కోర్టుకు వివరించారు. ఇళ్ల నిర్మాణం కోసం ఈ నెల 24న శంకుస్థాపన చేయబోతున్నారని..దీనిని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ప్రజాధనం వృథా కాదు: సీఆర్డీఏ చట్టంలోని నిబంధనల ప్రకారం సమీకరించిన మొత్తం భూమిలో 5 శాతాన్ని ఆర్థికంగా వెనుకబడిన తరగతుల ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించాలని ప్రభుత్వ్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. మాస్టర్ ప్లాన్లో ఇళ్ల కోసం స్థలం కేటాయించకపోవడంతో దానికి సవరణ చేశామని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద సమీకరించిన భూములపై ప్రభుత్వం, సీఆర్డీఏకు పూర్తి హక్కులున్నాయని కోర్టుకు నివేదించారు.
సీఆర్డీఏ, ప్రభుత్వానికి హక్కులు సంక్రమించాయి కాబట్టే గత ప్రభుత్వం వివిధ ప్రైవేటు సంస్థలకు 1,656 ఎకరాలను కేటాయించిందని గుర్తు చేసారు. అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు, జీవో 45పై సుప్రీంకోర్టు స్టే విధించలేదని వివరించారు. ఇళ్ల పట్టాల కేటాయింపుపై వ్యతిరేక తీర్పులు ఇచ్చినా ప్రజాధనం వృథా కాదని చెప్పారు. నిర్మించిన ఇళ్లను అలాగే ఉంచుతామని కోర్టుకు నివేదించారు. దీంతో 24న సీఎం జగన్ శంకుస్థాపన కార్యక్రమం యధావిధిగా జరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications