బాబు సర్కారుకు చుక్కెదురు: స్విస్ ఛాలెంజ్పై హైకోర్టు స్టే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. రాజధాని నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు స్టే విధించింది. ఈ విధానాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టులో వాదనలు వినిపించారు. ప్రపంచస్థాయి నగర నిర్మాణం కోసమే స్విస్ ఛాలెంజ్ విధానాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు. విదేశీ లేదా సింగపూర్ సంస్థలైతేనే భవనాల నిర్మాణాలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటాయని వివరించినట్లు తెలిసింది.

కాగా, ఆదిత్య కన్ స్ట్రక్చన్, చెన్నైకి చెందిన ఎన్వీఎన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సంస్థల తరపు న్యాయవాదులు కూడా తమ వాదనను బలంగానే వినిపించారు. దేశీయ సంస్థలను కాదని, విదేశీ సంస్థలకు నిర్మాణ పనులు అప్పగించడంలో దురుద్దేశం దాగివుందని వాదించారు. ఈ సంస్థలకు కూడా నిర్మాణ రంగంలో కావాల్సినంత అనుభవం ఉందని పేర్కొన్నారు.
హైకోర్టు స్విస్ ఛాలెంజ్ విధానంపై స్టే విధించడంపై ప్రభుత్వం డివిజన్ బెంచ్కు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, స్విస్ ఛాలెంజ్ విధానంపై ఇప్పటికే ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications