ఏపీ ఉష్ణోగ్రతల్లో సంచలన రికార్డ్
ఏపీలో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగడమే కాకుండా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంతపురం, కావలి, నెల్లూరు, తునితోపాటు అన్నమయ్య జిల్లాలోని ఆరోగ్యవరంలో సాధారణం కంటే అధికంగా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా పాణ్యంలో 43.7, కర్నూలు జిల్లా నందికొట్కూరు రూరల్ మండంలో 43.3, తిరుపతి జిల్లా గూడూరులో 42.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాబోయే రెండురోజుల్లో కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం 10 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యుల సలహాలతోపాటు నీరు ఎక్కువగా తాగుతుండాలని, నీటిశాతం అధికంగా ఉండే దోసకాయ, పుచ్చకాయలాంటివి ఎక్కువ తీసుకోవాలని సంస్థ అధికారులు సూచించారు. మజ్జిగ, బార్లీ, నిమ్మరంస, కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని, సాధ్యమైనంతవరకు బయటకు రాకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు.

ఎండవేడిమి, వడగాడ్పులు పెరుగుతుండటంతో ప్రజలకు అవగాహన కల్పించాలంటూ జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఉపాధి హామీ పనులను ఉదయం 10.30 గంటలకల్లా పూర్తిచేయాలని, పనులు జరుగుతున్న ప్రాంతంలో తాగునీరు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెడికల్ కిట్లు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. ఒంటిపూట బడులను ఉదయం 7.40 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సర్క్యులర్ జారీచేసినట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.












Click it and Unblock the Notifications