ఎల్లుండే.. యోగినీ ఏకాదశి: అరుదైన సమయం: ఈ నియమాలు పాటించండి చాలు
హిందూ సంప్రదాయంలో ఏకాదశి వ్రతానికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. ముఖ్యంగా ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని 'యోగినీ ఏకాదశి' అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున భక్తిశ్రద్ధలతో శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని, సుఖశాంతులు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఏడాది యోగినీ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, పూజా సమయాలు ఏమిటో తెలుసుకుందాం.
యోగినీ ఏకాదశి వ్రతాన్ని ఈ నెల 10వ తేదీ శుక్రవారం నాడు ఆచరించాలి. ఏకాదశి తిథి ఉదయం 8: 16 నిమిషాలకు ప్రారంభమై, మరుసటి రోజు తెల్లవారు జామున 5: 22 నిమిషాలకు ముగుస్తుంది. వ్రత దీక్షను విరమించే సమయం (పారణ) 11న మధ్యాహ్నం 1: 50 నిమిషాల నుంచి సాయంత్రం 4: 36 నిమిషాల మధ్య ఉంది.

నిష్కల్మషమైన మనస్సుతో యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరికీ శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. పద్మపురాణం ప్రకారం.. కుబేరుని శాపానికి గురై కుష్టువ్యాధితో బాధపడిన హేమమాలి అనే యక్షుడు ఈ పుణ్య వ్రతాన్ని ఆచరించి పూర్వ సౌందర్యాన్ని, వైభవాన్ని పొందాడు.
యోగినీ ఏకాదశి విశిష్టత, ప్రాముఖ్యత
ఈ రోజున తెల్లవారు జామునే లేచి తలస్నానం చేసి, పూజా గదిలో శ్రీమహావిష్ణువు పటాన్ని ప్రతిష్టించాలి. స్వామివారికి తులసి దళాలు, పసుపు రంగు పువ్వులు, చందనం సమర్పించి దీపారాధన చేయాలి. రోజంతా "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని జపిస్తూ ఆధ్యాత్మిక చింతనతో గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సాయంత్రం వేళ హారతి ఇచ్చి వ్రత కథ చదువుకోవాలి.
ఉపవాస నియమాలు..
యోగినీ ఏకాదశి రోజున భక్తులు తమ శక్తి కొద్దీ ఆహార నియమాలను పాటిస్తారు. కొందరు నిర్జల వ్రతాన్ని ఆచరిస్తే, మరికొందరు పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటారు. ఈ రోజున ముఖ్యంగా బియ్యంతో చేసిన వంటకాలు, పప్పుధాన్యాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లికి దూరంగా ఉండాలి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల వ్రత ఫలితం మరింత పెరుగుతుందని నమ్ముతారు.
చేయకూడని తప్పులు..
ముఖ్యంగా ఏకాదశి రోజున తులసి ఆకులను కోయడం మహాపాపంగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి స్వరూపమైన తులసి ఏకాదశి నాడు విష్ణుమూర్తి ప్రీత్యర్థం ఉపవాసం ఉంటుంది. అందువల్ల ఈ రోజున తులసి ఆకులను తుంచడం వల్ల ఆమె వ్రతానికి భంగం కలుగుతుందని నమ్ముతారు. దీనితో పాటు ఏకాదశి నాడు తులసి మొక్కకు నీరు పోయడం కూడా నిషిద్ధం. పూజకు అవసరమైన తులసి దళాలను ఒక రోజు ముందే సేకరించి ఉంచుకోవాలి.
ఏకాదశి రోజున బియ్యంతో తయారు చేసిన ఏ పదార్థాన్నైనా తీసుకోకూడదు. ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం, మద్యం వంటి తామసిక ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. యోగిని ఏకాదశి వ్రత సాధనలో శారీరక నియమాలు మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా ఎంతో అవసరం. ఈ రోజున ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకూడదు. రోజంతా శ్రీమహావిష్ణువు నామాన్ని జపిస్తూ, విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయడం వల్ల ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి.












Click it and Unblock the Notifications