అరకుపై బాలయ్య, పాకిస్తాన్లా కెసిఆర్: పల్లె
హైదరాబాద్: హుధుద్ తుపాను ప్రభావంతో అరకు 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అరకును అభివృద్ధి చేస్తామని, నందమూరి హీరో, హిందూపురం తెలుగుదేశం శాసనసభ్యుడు బాలకృష్ణ అన్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం సందర్భంగా శనివారం ఉదయం అరకు విచ్చేసిన బాలయ్య స్థానిక పార్కులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా అరకును అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతంలో రైతులకు అధిక ఆదాయం వచ్చే కాఫీ తోటలు తుఫాను తీవ్రతకు తీవ్రంగా దెబ్బ తిన్నాయని ఆయన అన్నారు. గిరిజన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో చిన్న చిన్న సినిమాలతో అరకులోయను సినిమా షూటింగులకు స్థానంగా మార్చామని చెప్పారు

భవిష్యత్తులో అరకు లోయలో మరిన్ని పెద్ద సినిమాల షూటింగ్ జరిగే విధంగా కృషి చేస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు సివేరి సోమ, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణతో కలిసి ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.
అనంతపురం జిల్లాలోని కలెక్టరేట్లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ కెసిఆర్పై ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీని పాకిస్తాన్లా చూస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టంలో ఉన్న మేరకే నిధులు వాడుకుంటున్నామని మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి వెల్లడించారు.
ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సేవలను మెరుగు పరిచి, ఎన్టీఆర్ ఆరోగ్య సేవలను విస్తృత పరుస్తామని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. 50 వేల జనాభాకు ఒక ఆరోగ్య మందుల షాపును జనవరి నుంచి ఏర్పాటు చేస్తామని తెలిపారు. శనివారం తిరుపతిలోని ఎస్టీవీ నగర్లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మంత్రి కామినేని పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications