చంద్రబాబుపై రాళ్ళ దాడి , ఇది వాళ్ళ కుట్రే : హోం మంత్రి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు
తిరుపతిలో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాటకాలాడుతున్నారని హోం మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు .టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్లువిసిరిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి సుచరిత స్పందించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన సుచరిత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాళ్ల దాడి జరిగిందనేది అవాస్తవమని పేర్కొన్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి పాలు అవుతుంది అన్నది గ్రహించే చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారు అని సుచరిత విమర్శలు గుప్పించారు.

రాళ్ల దాడి పేరుతో తిరుపతి ఎన్నికల్లో సానుభూతి పొందాలని చంద్రబాబు యత్నాలు
రాళ్ల దాడి పేరుతో తిరుపతి ఎన్నికల్లో సానుభూతి పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని హోం మంత్రి సుచరిత పేర్కొన్నారు. వైసీపీ నాయకులకు రాళ్లతో దాడి చేయాల్సిన అవసరం లేదని చెప్పిన సుచరిత, చంద్రబాబు పై జరిగిన రాళ్ల దాడి, టిడిపి కుట్రగా అభివర్ణించారు .తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో వైసీపీ విజయం తధ్యమని ఆమె పేర్కొన్నారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా సరే తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారని హోం మంత్రి సుచరిత ధీమా వ్యక్తం చేశారు .

వివేకా హత్యకేసులో త్వరలోనే నిజాలు బయటకు వస్తాయన్న హోం మంత్రి
ఇక ప్రతీది రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటైపోయింది అన్న సుచరిత వైయస్ వివేకా హత్య కేసు విచారణపై వస్తున్న విమర్శలపై కూడా స్పందించారు. వైయస్ వివేకా హత్య కేసు సిబిఐ పరిధిలో ఉందని పేర్కొన్న ఆమె సీబీఐ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు అంటూ తెలిపారు. వివేకా హత్య కేసుని కూడా భూతద్దంలో చూపిస్తున్నారని త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని హోంమంత్రి సుచరిత వెల్లడించారు. ఇక వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సిబిఐ విచారణపై బిజెపి, జనసేన నేతలు దృష్టి సారిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు .

చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో రాళ్ళ దాడి .. ఫైర్ అయిన టీడీపీ
ఈ కేసు త్వరితగతిన పూర్తి కావాలని తాము కూడా భావిస్తున్నామని సుచరిత పేర్కొన్నారు.
నిన్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో దుండగులు రాళ్లతో దాడి చేశారని టీడీపీ నేతలు వైసీపీ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు . వైసీపీ హయాంలో దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . చంద్రబాబు సభలో రాయి విసిరిన ఘటనను తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి, వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేశారు.

అసలు దాడే జరగలేదు ... ఇదంతా చంద్రబాబు డ్రామాలు అంటున్న వైసీపీ
రౌడీల పాలనలో ఇలాంటి ఘటనలు జరుగుతాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక చంద్రబాబు విమర్శలు వైసీపీ నేతలు తిప్పి కొడుతున్నారు. అందులో భాగంగా తాజాగా హోం మంత్రి సుచరిత కేవలం సానుభూతి కోసమే చంద్రబాబు రాళ్లదాడి పేరుతో కొత్త నాటకానికి తెర తీశారని విమర్శించారు.
ఇదంతా కావాలని ఎన్నికల సమయంలో సానుభూతి కోసం చేసే ప్రయత్నాలని , ఓట్ల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని మండిపడుతున్నారు .












Click it and Unblock the Notifications