పవన్ కళ్యాణ్, కాపు: రెచ్చిపోయి టిడిపిని చిక్కుల్లో పడేశారా?
హైదరాబాద్: హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ ఎంపీల ఘాటు స్పందన వారికే చేటు చేసిందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలకు కేవలం సమాధానం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
అయితే, అప్పటికే సుజనా చౌదరి, కేశినేని నాని వ్యాఖ్యలు ఘాటుగా విమర్శలు చేయడంతో జరగాల్సిన నష్టం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ ఘాటు విమర్శలకు.. టీడీపీ ఆచితూచి, తాము ఏం చేశామో చెబితే సరిపోయేదని అంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి - టిడిపిలకు మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ రెండుమూడుసార్లు మీడియా ముందుకు వచ్చారు. రాజధాని భూముల విషయమై ఓసారి జనాల్లోకి వెళ్లారు. ఆ తర్వాత ట్విట్టర్లో తనవంతుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయన అప్పుడే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాలేదని తేలింది.

అయితే, పవన్ కళ్యాణ్ విమర్శలకు.. నాని వంటి వారి అనవసరంగా రెచ్చిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతిగా పవన్ అభిమానులు రెచ్చిపోయారని, దిష్టిబొమ్మలను దగ్ధం చేసే స్థాయికి వెళ్లారని అంటున్నారు. పవన్ మద్దతు లేకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేదా అని కూడా ఫ్యాన్స్ ప్రశ్నించారు.
ఇంతవరకు రావడానికి కారణం ఒకరిద్దరు టిడిపి నేతల వల్లనే అంటున్నారు. వారు అంత ఘాటుగా స్పందించకుంటే... పవన్ మళ్లీ ట్విట్టర్ ద్వారా వివరాలు పెట్టి నిలదీయడం, అభిమానులు ధర్నాలు చేసే వరకు రాకపోయి ఉండేదని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ వెంట కాపు సామాజికవర్గం, అంతకుమించి యవత ఉంది. ఈ విషయాన్ని టిడిపి నేతలు విస్మరించారని అంటున్నారు. గత ఎన్నికల్లో టిడిపి గెలుపుకు కాపు సామాజిక వర్గం కూడా కారణం. అందుకు పవన్ పోటీ చేయడమేనని చెబుతున్నారు.
ఇప్పుడు, ఏపీకి మంచి చేసే ప్రత్యేక హోదా గురించి నిలదీస్తే, పవన్ కళ్యాణ్ను విమర్శించడం ద్వారా యువత, కాపు వర్గాల్లో నాని వంటి వారి పైన ఆగ్రహం ఉందని చెబుతున్నారు. పవన్ను విమర్శించడం వల్ల ఇప్పుడిప్పుడే దగ్గరవుతోన్న కాపులను ఒకింత దూరం చేసుకున్నట్లుగా అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ మాటేమిటో గానీ విజయవాడ నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచిన నాని మాత్రం వారిని దూరం చేసుకున్నట్లుగానే చెప్పవచ్చునని అంటున్నారు. ఈ ప్రభావం ఎంతో కొంత టీడీపీ పైన పడకమానదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications