జగనన్న స్మార్ట్ టౌన్ షిప్- చౌకగా 150-250 గజాల స్ధలాలు- ఫ్లాట్ల బుకింగ్ ఇలా
ఏపీలో మధ్యతరగతికి చౌక ధరల్లో ఇళ్లు కట్టుకోవడానికి వీలుగా భూములు అందించే కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల పేరుతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో చౌక ధరలకు ఇళ్ల స్ధలాలను మధ్య తరగతికి ప్రభుత్వమే విక్రయించబోతోంది. ఈ ప్రాజెక్టు తొలిదశను సీఎం జగన్ సంక్రాంతి రోజు అమరావతిలో ప్రారంభించబోతున్నారు. తొలిదశలో ఐదు జిల్లాల్లో ప్రాజెక్టు అమలు చేస్తారు. ఆ తర్వాత మిగతా జిల్లాలకు విస్తరిస్తారు.

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్
ఏపీలో దాదాపు 33 లక్షల మంది పేదలకు ఇళ్ల స్ధలాల్ని ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు మధ్య తరగతికి చౌక ధరల్లో ఇళ్ల స్ధలాలు సమకూర్చేందుకు సిద్ధమైంది. పేదలకు జగనన్న కాలనీల్లో ఇళ్ల స్ధలాల్లో ఇళ్లు కూడా కట్టిస్తుండగా.. మధ్యతరగతికి మాత్రం చౌక ధరల్లో ఇళ్ల స్ధలాలలను జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ పేరుతో సమకూర్చబోతోంది. ఇందులో భాగంగా తొలుత ఐదు జిల్లాల్లో భూముల సేకరణ పూర్తయింది. దీంతో ఈ సంక్రాంతి రోజు సీఎం జగన్ అమరావతిలో ఈ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు. తొలిదశలో మంగళగిరిలోని అమరావతి టౌన్ షిప్ తో పాటు రాష్ట్రంలో మరో నాలుగు పట్టణాభివృద్ధి సంస్ధల పరిధిలో ఈ లే అవుట్లను ప్రారంభించబోతున్నారు.

మధ్యతరగతికి చౌకగా ఇళ్ల స్ధలాలు
ప్రస్తుతం రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజలు ఇళ్ల స్ధలం కొనుక్కోవాలంటే మార్కెట్ ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్దితి. అసలే రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలు. దీంతో ఇంటి స్ధలం కొనుగోలు చేయాలన్నా భారీ మొత్తాల్ని వెచ్చించాల్సిన పరిస్ధితులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ స్ధలాల్లో మార్కెట్ ధర కంటే చౌక ధరలోనే ఇళ్ల స్ధలాలను మధ్యతరగతి ప్రజలకు అందించనున్నారు. దీంతో మధ్యతరగతి వీటిలో ఇళ్లు కట్టుకునేందుకు బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు తీసుకునేందుకుప సైతం వీలవుతుంది.

ఎక్కడెక్కడంటే
తొలిదశలో భాగంగా ప్రస్తుతం ఐదు జిల్లాల్లో ప్రభుత్వం ఈ టౌన్ షిప్ లను అభివృద్ధి చేయనుంది. ఇందులో మంగళగిరిలోని అమరావతి టౌన్ షిప్ తో పాటు అనంతపురంలోని అహుడా పరిధిలో ధర్మవరం యూఎల్ బీలో కుంతూరు రూరల్, నెల్లూరు జిల్లా నుడా పరిధిలోని జలదంకి యూఎల్బీలో జమ్మలపాలెం, కడప జిల్లాలో ఆడా పరిధిలో రాయచోటి యూఎల్బీలోని దిగువ అంబవరం, ప్రకాశం జిల్లా అనుడా పరిధిలోని కుందుకూరులో ఎంఐజీ లే అవుట్లను ప్రభుత్వం ప్రారంభించబోతోంది.

లే అవుట్ల అభివృద్ధి ఇలా
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో భాగంగా ప్రతీ లే అవుట్ లోనూ 40 నుంచి 60 అడుగుల బీటీ రోడ్లు అభివృద్ధి చేస్తారు. ఈ లే అవుట్లలో నిరంతరం నీటి సరఫరాతో పాటు వీధి దీపాలు కూడా అమరుస్తారు. ఫుట్ పాత్ లను కూడా నిర్మిస్తారు. పూర్తిగా అండర్ గ్రౌండ్ విధానం అమలు చేస్తారు. డ్రైనేజీలతో పాటు ఆటస్ధలాలు, ప్రజావసరాల కోసం బహిరంగ స్ధలాలకు కేటాయింపులు ఉంటాయి. దీంతో మధ్యతరగతి ప్రజలు ఇళ్లను నిర్మించేందుకు ముందుకొస్తారని అధికారులు భావిస్తున్నారు.
వీటి అభివృద్ధి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవడంతో కొనుగోలుదారుల నుంచి ఆదరణ ఉంటుందని అంచనా.

ప్లాట్ల బుకింగ్ ఇలా
జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో ప్లాట్ కావాలంటే డైరెక్టర్ ఆఫ్ టౌన్, కంట్రీ ప్లానింగ్ వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ పోర్టల్ లో లే అవుట్లు అందుబాటులో ఉన్నాయి. నచ్చిన ప్లాట్ ను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. 150, 150, 140 చదరపు గజాల్లో లే అవుట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఆన్ లైన్ బుకింగ్ సమయంలో ప్లాట్ విలువలో 10 శాతం చెల్లించాలి. ప్లాట్ కేటాయించడానికి నెల రోజుల ముందు సదరు పట్టణాభివృద్ధి సంస్ధకూ, లబ్దిదారుడికీ మధ్య ఒప్పందం జరుగుతుంది. నెల తర్వాత ప్లాట్ వ్యయంలో 30 శాతం చెల్లించాలి. ఆరు నెలల తర్వాత మరో 30 శాతం చెల్లించాలి. 12 నెలల తర్వాత మిగిలిన 30 శాతం డబ్బుల్ని చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లాట్ల ధరలు, ఇతర వివరాలు వెబ్ సైట్లోనే అందుబాటులో ఉంచనున్నారు.












Click it and Unblock the Notifications