ఏపీ పాలిటిక్స్ లో కొత్త ట్విస్ట్ - టీడీపీ మైండ్ గేమ్-వైసీపీ అభ్యంతరం-తెరపైకి 3 రాజధానులు!
ఏపీలో ముందస్తు ఎన్నికల రాగాల సంగతేమో కానీ రోజుకో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇప్పటివరకూ ఎన్నికల అజెండాలో లేని కొత్త అంశాలు తెరపైకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఇదే కోవలో వైసీపీని దెబ్బ కొట్టేందుకు టీడీపీ మొదలుపెట్టిన ఓ కొత్త మైండ్ గేమ్ కు వైసీపీ మొహమాటంగానే రియాక్ట్ అయింది. దీంతో ట్రాప్ లో పడినట్లయింది. ఇదే అదనుగా టీడీపీ వైసీపీ అజెండాలో ఉన్న మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చేసింది. దీంతో ఏం చేయాలో తెలియక మళ్లీ వైసీపీ ఆత్మరక్షణలో పడింది.
ఏపీలో మైండ్ గేమ్ పాలిటిక్స్
ఏపీలో నేరుగా రాజకీయాలు చేసే స్ధాయి నుంచి మైండ్ గేమ్ రాజకీయాలు ఆడే స్ధాయికి పరిస్ధితులు మారిపోతున్నాయి. ముఖ్యంగా పాత చింతకాయ పచ్చడి రాజకీయాలు చేస్తే జనం ఆదరించే పరిస్ధితులు లేవని తేలిపోవడంతో అధికార, విపక్షాలు సైతం మైండ్ గేమ్ రాజకీయాలనే నమ్ముకుంటున్నాయి. ఒకప్పుడు ఇదే మైండ్ గేమ్ రాజకీయంతో సీఎంగా ఉన్న ప్రత్యర్ధి చంద్రబాబును జగన్ దెబ్బకొట్టి అధికారం అందుకోగా.. ఇప్పుడు అలాంటి మరో మైండ్ గేమ్ రాజకీయంతో జగన్ ను ఇరుకునపెట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. దీంతో ఏపీ పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారిపోయాయి.
శ్రీలంకతో ఏపీకి పోలిక
గత కొంతకాలంగా ఆర్దిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న పొరుగుదేశం శ్రీలంకలో రాజకీయాలు కూడా వేగంగా మారిపోయాయి. ఒకప్పుడు దేశ రాజకీయాల్ని పూర్తిగా తమ గుప్పిట్లో ఉంచుకున్న రాజపక్స సోదరుల్ని దేశం నుంచి పారిపోయేలా చేసిన ఘనత ప్రజలకే దక్కింది. దీనంతటికీ ప్రధాన కారణం ఆర్ధిక వైఫల్యాలే. అదే సమయంలో ఏపీలోనూ కేంద్రాన్ని సైతం లెక్కచేయకుండా భారీ అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలు నడిపిస్తున్న వైసీపీ సర్కార్ కూడా ఏపీని శ్రీలంకగా మార్చేస్తోందంటూ టీడీపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది.
శ్రీలంక పోలికపై సజ్జల అభ్యంతరాలు
ఏపీలో ఆర్ధిక ఇబ్బందుల్ని శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభంతో పోలుస్తూ టీడీపీ చేస్తున్న ఆరోపణల్ని తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుబట్టారు. ఓ రాష్ట్రాన్ని ఎక్కడైనా దేశంతో పోలుస్తారా అంటూ స్పందించారు. ఏపీలో ప్రజలకు సంక్షేమం అందించడానికి ప్రభుత్వం అప్పులు చేస్తుంటే శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభానికి కారణమైన పరిస్ధితులతో పోలుస్తున్నారంటూ టీడీపీపై సజ్జల మండిపడ్డారు. దీంతో టీడీపీ చేస్తున్న ఆరోపణలకు ఘాటు కౌంటర్ ఇచ్చేందుకు సజ్జల ప్రయత్నించారు.
తెరపైకి మూడు రాజధానుల్ని తెచ్చిన టీడీపీ
పొరుగు దేశమైన శ్రీలంకతో భారత్ లో రాష్ట్రమైన ఏపీని ఎలా పోలుస్తారంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి లేవనెత్తిన అభ్యంతరాల్ని కూడా టీడీపీ వాడుకోవడం మొదలుపెట్టేసింది. దీనికి కౌంటర్ గా మూడు రాజధానుల్ని ఆ పార్టీ తెరపైకి తెస్తోంది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు సమయంలో వాటిని దక్షిణాఫ్రికాతో వైసీపీ సర్కార్ పోల్చింది. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తుచేస్తూ టీడీపీ నేతలు అప్పుడు మీరు దేశమైన దక్షిణాఫ్రికాతో ఏపీని పోల్చి మూడు రాజధానులు తీసుకురాలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు వైసీపీ వద్ద సమాధానం లేకుండా పోతోంది.
అనూహ్యంగా టీడీపీ ట్రాప్ లో పడ్డారా?
శ్రీలంకతో ఏపీని పోలుస్తూ టీడీపీ నేతలు మొదలుపెట్టిన ప్రచారంపై వైసీపీ పెద్దలు మొదట్లో సైలెంట్ గానే ఉన్నారు. ఆ తర్వాత టీడీపీ అనుకూల మీడియా కూడా పదే పదే ఇదే ప్రచారం చేయడంతో వైసీపీ స్పందించక తప్పలేదు. అయితే నేరుగా ఈ విషయం చెప్పకుండా మరోలా కౌంటర్ చేస్తే సరిపోయేది. అలా కాకుండా రాష్ట్రాన్ని దేశంతో పోలుస్తారా అంటూ ప్రశ్నించడం ద్వారా టీడీపీ ట్రాప్ లో పడ్డారు. శ్రీలంక సంక్షోభంపై ఏపీలో చర్చ జరిగితే అఫ్పులు, ఇతర నిర్ణయాలు చర్చకు వస్తాయి.
అప్పుడు సహజంగానే వైసీపీ సర్కార్ ఇరుకున పడటం ఖాయం. కానీ వైసీపీ మాత్రం అదే తప్పు చేసినట్లు కనిపిస్తోంది. దీంతో ఓవైపు శ్రీలంకతో ఏపీ పోలికపై చర్చకు అవకాశం కల్పించడమే కాదు, అటు మూడు రాజధానుల్ని దక్షిణాఫ్రికాతో పోల్చలేదా అంటూ సెటైర్లు వేసేందుకు కూడా అవకాశమిచ్చినట్లు కనిపిస్తోంది. తద్వారా వైసీపీ ఈ విషయంలో టీడీపీ ట్రాప్ లో పడినట్లు అర్దమవుతోంది.