మజ్జి సిరి భర్త అవుట్: జగన్ దిద్దుబాటు- రాత్రికి రాత్రి ఉత్తర్వులు
విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మజ్జి శ్రీను పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. జిల్లాలో సంస్థాగత నిర్మాణంలో కీలక మార్పులు చేపట్టింది పార్టీ అగ్రనాయకత్వం. ఈ క్రమంలో కొన్ని మార్పులు చేర్పులకు పూనుకుంది. జిల్లా అధ్యక్ష పదవి నుంచి నెల్లిమర్ల నియోజకవర్గం వరకు ఈ మార్పులు సంభవించాయి. ఇది జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది.
విజయనగరం జిల్లా పార్టీ నూతన అధ్యక్షుడిగా మాజీ పార్లమెంట్ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ నియమితులయ్యారు. దీంతో పాటు నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ బాధ్యతలను గదల సన్యాసి నాయుడికి అప్పగించారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. జిల్లాలో పార్టీ పటిష్టతే పరమావధిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ బాధ్యతలను కేటాయించారు.

నిన్నటివరకు కూడా మజ్జి శ్రీను అల్లుడు, మజ్జి సిరి భర్త బడ్డుకొండ ప్రదీప్ నాయుడు నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జ్ గా వ్యవహరించారు. మజ్జి శ్రీను, సిరి టీడీపలో ఉండగా.. ప్రదీప్ నాయుడు వైసీపీ ఇన్ ఛార్జీగా కొనసాగడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. జిల్లా పార్టీ వర్గాలు సైతం దీన్ని తప్పుపట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జీని మార్చింది వైసీపీ అగ్రనాయకత్వం. తాజాగా ఈ బాధ్యతలను గదల సన్యాసి నాయుడికి అప్పగించింది.
శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారిని విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులుగా, శ్రీ గదల సన్యాసినాయుడు గారిని నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన వైయస్ఆర్సీపీ అధ్యక్షులు @ysjagan గారు. pic.twitter.com/XdAgmr7wrw
— YSR Congress Party (@YSRCParty) September 12, 2026
విజయనగరం జిల్లా రాజకీయాలపై దీర్ఘకాలిక పట్టున్న బెల్లాన చంద్రశేఖర్కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా కేడర్లో నూతన ఉత్సాహం నింపాలని అధిష్ఠానం బలంగా భావిస్తోంది. ఎంపీ పనిచేసిన విస్తృత అనుభవం ఉండటంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలను సమన్వయం చేసుకుంటూ రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించనున్నారు.
మరోవైపు నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన గదల సన్యాసి నాయుడు త్వరలోనే స్థానిక వైఎస్సార్సీపీ కార్యకర్తలతో మరియు నాయకత్వంతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. నియోజకవర్గ పరిధిలోని క్షేత్రస్థాయి శ్రేణులతో నిరంతరం మమేకమై పార్టీ బలాన్ని మరింత పెంచడం ఆయన ముందున్న అత్యంత కీలకమైన బాధ్యత. స్థానిక నేతల మధ్య సమన్వయాన్ని పెంచి అందరినీ ఒకేతాటిపైకి నడిపించాల్సిన అవసరం ఉంది.













Click it and Unblock the Notifications
