అధికారిపై రెచ్చిన ఎంపీ కేశినేని నాని: ఇదీ జరిగింది.. చంద్రబాబుకు వివరణ
విజయవాడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉదంతంపై టిడిపి నేతలు బోండా ఉమ, కేశినేని నాని తదితరులు ఆదివారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. శనివారం ట్రాన్సుపోర్ట్ కార్యాలయం వద్ద ఏం జరిగిందో వివరించారు.
విజయవాడ: విజయవాడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉదంతంపై టిడిపి నేతలు బోండా ఉమ, కేశినేని నాని తదితరులు ఆదివారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. శనివారం ట్రాన్సుపోర్ట్ కార్యాలయం వద్ద ఏం జరిగిందో వివరించారు.
మరోవైపు, పలువురు ఉద్యోగులు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ను కలిశారు. అనుచితంగా ప్రవర్తించిన టిడిపి నేతలపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
కాగా, శనివారం నాడు టిడిపి నేతలు విజయవాడ ఆర్టీయే కార్యాలయం వద్ద హంగామా సృష్టించారు. రవాణా శాఖ కమిషనర్, టీటీసీలు అవినీతిపరులు అంటూ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డి తింటున్నారా అంటూ అధికారులను దుర్భాషాలాడినట్లుగా తెలుస్తోంది.
కమిషనర్, డీటీసీలను ఘెరవ్ చేయడమే కాక, క్షణాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ నాగుల్ మీరా తదితరులు జత కలిశారు.
ప్రయివేటు బస్సులకు అక్రమంగా అనుమతులు ఇస్తూ డబ్బులు దండుకుంటున్నారని, దానివల్ల ఆర్టీసికి ఎంత నష్టం వస్తుందో మీకు తెలుసా అని కేశినేని నాని అధికారులపై మండిపడ్డారు. ప్రయివేటు బస్సులకు యాక్సిడెంట్ జరిగితే ఆ నిందలు టిడిపి ప్రభుత్వంపై పడాలా అని ధ్వజమెత్తారు. టిడిపి నేతల తీరుతో రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.