ఎవరికి కాకుండా చేయొద్దు: హైదరాబాదుపై లగడపాటి
విజయవాడ: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అన్ని ప్రాంతాల వారిదని, దాని పైన ప్రయోగాలు చేసి ఎవరికీ కాకుండా చేసేందుకు ప్రయత్నించడం సరికాదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత లగడపాటి రాజగోపాల్ గురువారం అన్నారు. ఆయన గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారితోటలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. సమైక్యాంధ్రగా ఉంచడానికే తప్ప ఏ అంశానికి తాము తలొగ్గేది లేదని చెప్పారు. దత్తపుత్రుడు, వేర్పాటువాదుల అండతోనే కాంగ్రెసు పార్టీ అధిష్టానం విభజనకు నిర్ణయం తీసుకుందని లగడపాటి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెరాసను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తాము మొదటి నుండి పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
డిఎస్తో కన్నా భేటీ
పిసిసి మాజీ అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు డి శ్రీనివాస్తో మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ గురువారం భేటీ అయ్యారు.
హైదరాబాదుకు కిరణ్ తిరుగు పయనం
తన సొంత జిల్లా చిత్తూరు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదుకు గురువారం ఉదయం బయలుదేరారు.
జివోఎం సమావేశం
విభజనపై వేసిన కేంద్ర మంత్రుల బృందం ఢిల్లీలో భేటీ అయింది. గులాం నబీ ఆజాద్ మినహా మిగతా సభ్యులు హాజరయ్యారు. సుశీల్ కుమార్ షిండే, నారాయణ స్వామి, జైరామ్ రమేష్ తదితరులు హాజరయ్యారు. నార్త్ బ్లాక్కు కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు వచ్చారు.