చంద్రబాబు పోటీ చేసినా గెలుపు నాదే: తలసాని, కెసిఆర్పై పొన్నాల ఫైర్
హైదరాబాద్: సనత్నగర్ ఉప ఎన్నికలో తనదే విజయమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. అంతేగాక, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోటీ చేసినా తనదే గెలుపని చెప్పారు.
ఇటీవలే తెలుగుదేశం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరిన తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సనత్నగర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో సనత్ నగర్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఇటీవల హైదరాబాద్ నగరంలో మంచి పట్టున్న కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ తెలుగుదేశం పార్టీలో చేరతారని వార్తలు వెలువడ్డాయి. అంతేగాక, ఆయనే సనత్నగర్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తారని కూడా ఊహాగానాలు వెలువడ్డాయి.
ఎర్రగడ్డ దిశగా కెసిఆర్ పాలన: పొన్నాల
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం భువనగిరిలో మాట్లాడుతూ.. కెసిఆర్ పాలన ఎర్రగడ్డ దిశగా సాగుతోందని విమర్శించారు. గాలి పర్యటనలు, అనవసర పథకాల పేరుతో కెసిఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రభుత్వంలో అనుభవలేమి, అభద్రత నెలకొన్నాయని పొన్నాల అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి నియంతృత్వ పోకడలను అనుసరిస్తున్నారని కెసిఆర్పై మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 740 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. విద్యుత్ సమస్యను ఇప్పటికీ పరిష్కరించలేకపోయారని ధ్వజమెత్తారు.