వాడుకుంటున్నారు, అదే సవాల్: జగన్తో పొత్తుపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Recommended Video

అమరావతి: ప్రజల కోసం, ముఖ్యంగా పేదవారి కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్న ఏ పార్టీతో అయినా కలిసి పని చేసేందుకు తాను సిద్ధమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన ఇంగ్లీష్ చానల్తో మాట్లాడారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
స్థానిక, రాష్ట్రస్థాయి నేతలు వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇక్కడ ఎంతో ఖనిజ సంపద, వ్యవసాయం ఉందని చెప్పారు. ఇక్కడి వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవిస్తున్నారని వాపోయారు. ప్రమాదాలు జరిగినప్పుడు శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు చెందినవారు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది తనను ఎంతో ఆవేదనకు గురి చేస్తోందన్నారు.

పరిస్థితులు ఏమీ మారలేదు
జూట్ మిల్స్, కో ఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీలు ఏళ్లుగా మూతబడ్డాయని, కానీ రాజకీయ నాయకులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదని పవన్ ఆరోపించారు. నాయకులు మాత్రం ధనికులు అవుతున్నారన్నారు. పరిస్థితులు చూస్తుంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏమాత్రం మారనట్లుగా ఉందన్నారు.

ప్రజలను చైతన్యపరుస్తున్నా
ప్రజలకు వారి ప్రాథమిక హక్కుల గుర్తు చేయడమే తన ఉద్దేశ్యమని పవన్ చెప్పారు. నేనేదో వారిని రెచ్చగొడుతున్నానని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని, కానీ నేను వారిని చైతన్యపరుస్తున్నానని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయన్నారు. అక్కడి సామాన్య ప్రజలు రాజకీయ నాయకులు అన్నా, అధికార పార్టీ అన్నా భయపడతారన్నారు. దానిని రూపుమాపడమే తన ఉద్దేశ్యమన్నారు.

పుట్టపర్తి సాయిబాబా చేశారు, రాష్ట్రాలు ఎందుకు చేయలేవు?
కేంద్రం తీసుకు వచ్చిన జీఎస్టీపై పవన్ స్పందిస్తూ.. అది నష్టమేమీ కాదని, కానీ సరిగా అమలు చేయాలన్నారు. దీని ద్వారా వచ్చిన డబ్బును తిరిగి అభివృద్ధికి ఉపయోగించాలన్నారు. సత్య సాయిబాబా వంటి వారు పుట్టపర్తిని అభివృద్ధి పరిచినప్పుడు, రాష్ట్రాలు ఎందుకు చేయలేవని ప్రశ్నించారు. నాయకుల్లో చిత్తశుద్ధి లేదన్నారు.

పార్టీలకు డబ్బు అవసరమే కానీ
రాజకీయ పార్టీ నడపాలంటే డబ్బులు అవసరమనే విషయాన్ని తాను అంగీకరిస్తానని పవన్ అన్నారు. కానీ ఎంత అని ప్రశ్నించారు. ఎంత అవసరమో అంతే అన్నారు. ఇప్పుడు ఓట్లను కొనుగోలు చేసి, ఆ తర్వాత రాష్ట్రాన్ని దోచుకుంటారని ఆరోపించారు. ఇది సంకీర్ణ ప్రభుత్వాల కాలమని, రాష్ట్ర, కేంద్రాల్లో అవే కీలకం కానున్నాయన్నారు. తాను ఏ పార్టీకి వ్యతిరేకం కాదన్నారు. ప్రజల కోసం ఏ పార్టీతో అయినా కలుస్తానని చెప్పారు. లెఫ్ట్ పార్టీల ఐడియాలజీ తనకు దగ్గరగా ఉంటుందన్నారు.

వైసీపీతో పొత్తుపై
లెఫ్ట్ పార్టీలు తన ఆలోచనలకు దగ్గరగా ఉంటాయని పవన్ చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ.. అప్పుడే దీని గురించి చెప్పలేమని అభిప్రాయపడ్డారు. అప్పటి పరిస్థితిని బట్టి చూస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కర్ణాటక ఫలితాలను అందరం చూశామని, ఏపీ ఫలితాలు కూడా ఎలా ఉంటాయో చూడాలన్నారు. మంచి పాలన తన ఉద్దేశ్యమని, అయినా అన్నీ ఎన్నికల తర్వాతే తేలుతాయన్నారు.

నన్ను ఉపయోగించుకుంటున్నారని తెలుసు
అభ్యర్థుల ఎంపిక చాలా సవాల్తో కూడుకున్నదని పవన్ అన్నారు. కొందరు తాము ఎదిగేందుకు తనను నిచ్చెనగా ఉపయోగించుకుంటున్న విషయం తెలుసునని చెప్పారు. వారు తనను ఉపయోగించుకున్నా పరవాలేదని, కానీ వారు ప్రజల వైపు నిలబడాలని, ముఖ్యంగా పేదవారి కోసం పని చేయాలని, అలాంటి వారు తనను ఉపయోగించుకున్నా ఫర్వాలేదన్నారు.












Click it and Unblock the Notifications